బిగ్ బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్గా 80 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. చివరి రెండు వారాలు ఇంటికి కెప్టెన్ ఉండే అవకాశం లేదు. ఈ వారం ఉండే వారు హౌజ్కి చివరి కెప్టెన్. టాస్క్లో భాగంగా బిగ్ బాస్ ‘నియంత మాటే శాసనం’ అనే టాస్క్ ఇచ్చారు. సైరన్ మోగిన ప్రతిసారీ ఏ సభ్యుడైతే నియంత సింహాసనంపై కూర్చుంటాడో వారు ఆ రౌండ్లో సేఫ్ కావడంతో పాటు నియంతగా వ్యవహరిస్తారు.
మిగిలిన ఇంటి సభ్యులు తమని తాము సేవ్ చేసుకోవడానికి ఒక ఛాలెంజ్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఆ ఛాలెంజ్లో చివరి రెండు స్థానాల్లో నిలిచిన ఇద్దరు సభ్యులు.. నియంతతో మాట్లాడి తమని తాము సేవ్ చేయడానికి ఒప్పించుకోవాలి. ఇద్దరి వాదనలు విన్న తరువాత నియంత ఎవర్ని పోటీలో ఉంచాలి.. ఎవర్ని పోటీ నుంచి తొలగించాలో నిర్ణయిస్తారని టాస్క్ ఇచ్చారు. అయితే తొలి రౌండ్లో నియంత సింహాసనాన్ని సిరి దక్కించుకుంది. దీంతో మిగిలిన వారికి క్యాప్ హుక్స్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్లో రవి, సన్నీలు మాత్రమే చివరి రెండు స్థానాల్లో నిలిచారు. రవిని నెక్స్ట్ రౌండ్కి ప్రపోట్ చేసి సన్నీకి చెక్ పెట్టింది. దీంతో ప్రతిసారి నన్నే టార్గెట్ చేస్తున్నారని షణ్ముఖ్ దగ్గర బాధపడ్డాడు.
ఇక రెండో రౌండ్లో నియంత సింహాసనాన్ని శ్రీరామ్ చేజిక్కించుకున్నాడు. మిగిలిన ఇంటి సభ్యులకి మరో టాస్క్ ఇచ్చారు. కాళ్లకి చెప్పులు ధరించి ఆ చెప్పుల్ని ఎదురుగా ఉన్న గోడపై వీలైనంత ఎత్తులో అతికించాల్సి ఉంటుంది.. ఎవరైతే తక్కువ ఎత్తులో చెప్పుల్ని అతికిస్తారో చివరి ఇద్దరి సభ్యులు నియంతని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఈ టాస్క్లో కాజల్, రవిలు చివరి స్థానాల్లో నిలవగా నియంత శ్రీరామ్ కాజల్ని డిస్ క్వాలిఫై చేసి రవిని నెక్స్ట్ లెవల్కి ప్రమోట్ చేశాడు. కెప్టెన్ అయ్యే చివరి అవకాశాన్ని కూడా లేకుండా చేశావ్ అని కాజల్ ఏడ్చేసింది. ఒక్కసారి కూడా కెప్టెన్ని కాలేకపోయానని బాత్ రూంలోకి వెళ్లి ఏడ్చింది.