హైదరాబాద్: తనదైన నటనతో నవరస నటసార్వభౌముడిగా పేరుతెచ్చుకున్న కైకాల సత్యనారాయణ తొలుత హీరోగా సినీరంగ ప్రవేశం చేశారు. అయితే తొలి సినిమాతో ఆయన పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. దీంతో మళ్లీ సినిమా అవకాశాల కోసం చాలా కాలంపాటు ఆయన నిరీక్షించాల్సి వచ్చింది. అయితే దర్శకుడు విఠలాచార్య ఇచ్చిన సలహాతో విలన్గా నటించడం ప్రారంభించారు. దీంతో అవకాశాలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి.
కైకాల సత్యనారాయణ 1959లో ‘సిపాయి కూతురు’ సినిమాతో తెలుగు సినీపరిశ్రమకు హీరోగా పరిచయమయ్యారు. అయితే అంతలా ఆడకపోవడంతో సరైన అవకాశాల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. చిత్రసీమలో నిలదొక్కుకోవాలని నిర్ణయించుకున్న సత్యనారాయణ.. తన తొలి హీరోయిన్ జమునతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. అనేక సినిమాల్లో ఆమెను భయపెట్టే పాత్రల్లోనూ కనిపించారు. ‘ఈ కాలం దంపతులు’ అనే చిత్రంలో హీరోగా జమునతోనే కలిసి నటించారు. అయితే ఆ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. తర్వాత ఆయన కథనాయకుడిగా చేసిన ‘తాయారమ్మ-బంగారయ్య’ చిత్రం మంచి విజయాన్ని అందుకున్నది. తర్వాత సంసారం-సాగరం, మొరటోడు వంటి సినిమాల్లో కైకాల హీరోగా చేశారు.
అయితే కైకాలలోని విలనిజాన్ని విఠాలాచార్య గుర్తించారు. సినీపరిశ్రమలో ప్రతినాయక ప్రాతలు వేసేవారు తక్కువగా ఉన్నారని, అటువైపు వెళ్లాలని ఆయన కైకాలకు సూచించారు. దీంతో విఠాలాచార్య దర్శకత్వంలో రూపొందిన ‘కనకదుర్గ పూజ మహిమ’ అనే చిత్రంలో తొలిసారి విలన్గా నటించారు. అయితే ఎన్టీఆర్ అగ్గిపిడుగు సినిమాతో ఆయన సినీ జీవితం మలుపుతిరిగింది. ఎన్నో సినిమాల్లో తన డైలాగ్ డెలివరితో హీరోలతో పోటీపడి ప్రతినాయకుడి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
అనంతరం కమెడియన్గా, తండ్రిగా, తాతగా కూడా రాణించారు. మొత్తంగా తన 60 ఏళ్ల సినీజీవితంలో 777 సినిమాల్లో నటించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్వీ రంగారావు తర్వాత అలాంటి వైవిధ్యభరితమైన పాత్రలు పోషించిన నటుడు కైకాల ఒక్కరే కావడం గమనార్హం. ఎన్టీఆర్ ‘యమగోల’ సినిమాలో కైకాల పోషించిన యమధర్మరాజు పాత్ర ఆయనకు మరింత ప్రతిష్ఠను తెచ్చిపెట్టింది. యముడు అంటే కైకాల సత్యనారాయణ అనేలా చేసింది. ఆ తరవాత ‘యమలీల’ సినిమాలోనూ కామెడీ యముడిగా కైకాల అదరగొట్టారు. 2019లో ‘మహర్షి’ సినిమాలో చివరిసారిగా కనిపించారు.