దైవ లిఖితం అంటే ఇదేనేమో. తెలుగు సినిమాను శిఖరంపై నిలబెట్టిన ‘శంకరాభరణం’ విడుదలైన ఫిబ్రవరి 2నే కళాతపస్వి కన్నుమూయడం నిజంగా యాదృచ్ఛికమే అనిపిస్తుంది. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కళాతపస్వీ.. గురవారం రాత్రి కన్నుమూశాడు. ఆయన మరణ వార్తతో యావత్ సినీ పరిశ్రమ దుఃఖ సంద్రంలో మునిగిపోయింది.
సౌండ్ రికార్డిస్ట్గా కెరీర్ ప్రారంభించిన కళాతపస్వీ.. సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘పాతాళభైరవి’తో అసిస్టెంట్ డైరెక్టర్గా మారారు. అలా 14ఏళ్ల పాటు పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి 1965లో అక్కినేని నాగేశ్వరరావుతో ‘ఆత్మగౌరవం’ సినిమా తెరకెక్కించాడు. తొలి సినిమాకే నంది అవార్డు గెలుచుకుని ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. చెల్లెలికాపురం, శారద, ఓ సీత కథ, నేరము శిక్ష వంటి పలు సినిమాలతో ఆడియెన్స్లో విశేషమైన అభిమానాన్ని సంపాదించుకున్నాడు.
ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘శంకరాభరణం’ అయితే ఒక సెన్సేషన్. ముసలివాడిని హీరోగా పెట్టి సినిమా తీస్తారా అని ముప్పైరెండు పళ్లు కనిపించేలా నవ్వినవారే ఈ సినిమా సక్సెస్ను చూసి ముక్కున వేలేసుకున్నారు. పది జన్మలెత్తిన ఆయన స్థాయి సినిమాలు తీయలేరని నిరూపించాడు. ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లలో చాలా మంది ఇండస్ట్రీలోకి రావాలని కోరిక పుట్టింది. ఈ సినిమాతోనే అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. వందేళ్ల ఇండియన్ సినిమా చరిత్రలో గొప్ప సినిమాల లిస్ట్లో శంకరాభరణం కూడా ఉంటుంది. ఈ సినిమాకు నాలుగు నేషనల్ అవార్డులు, ఏడు నందీ అవార్డులు వరించాయి.
ఇక కళాతపస్వీ స్టార్ల ఇమేజ్తో సంబంధంలేకుండా సినిమాలు తీసేవాడు. ఏఎన్ఆర్ సూత్రధారులు, కమల్హాసన్ సాగరసంగమం-స్వాతిముత్యం, చిరంజీవి స్వయం కృషి, బాలకృష్ణ జనని జన్మభూమి, వెంకటేశ్ స్వర్ణ కమలం, రాజశేఖర్ శృతిలయలు వంటి సినిమాలతో ఒక స్టార్ హీరోతో ప్రయోగాలు చేసి కూడా హిట్లు కొట్టొచ్చు అని నిరూపించిన ఘనత ఆయనది.