కళాతపస్వి మరణంతో యావత్ సినీ ఇండస్ట్రీ దుఃఖ సాగరంలో మునిగిపోయింది. గతకొంత కాలంగా వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దాంతో వెంటనే ఆయన్ను జూబ్లిహిల్స్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. దర్శకుడిగా, నటుడిగా ఇండస్ట్రీలో చెదిరిపోని ముద్ర వేశాడు. ఆహ్లాదం, ఆనందం కోసమే కాదు, ఆలోచించే విధంగా కూడా సినిమాలు తీయోచ్చని చెప్పిన గొప్ప వ్యక్తి కే. విశ్వనాథ్ గారు.
‘ఆత్మగౌరవం’ సినిమాతో దర్శకుడిగా తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన కళాతపస్వి.. ఐదు దశాబ్ధాల్లో 50పైగా చిత్రాలను తెరకెక్కించాడు. తొలి సినిమాతోనే ప్రతిభగల దర్శకుడిగా ముద్ర వేసుకున్నాడు. శంకరాభరణం, సప్త పది, సిరిసిరి మువ్వలు, స్వాతి ముత్యం, సాగర సంగమం, స్వయం కృషి వంటి పలు సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచాడు. ఇక కే. విశ్వనాథ్ గారి చివరి చిత్రం శుభప్రదం.
శ్రీకాంత్తో ‘స్వరాభిషేకం’ తర్వాత దాదాపు ఆరేళ్లు గ్యాప్ తీసుకుని ‘శుభప్రదం’ సినిమాను తెరకెక్కించాడు. అల్లరి నరేష్, మంజారి ఫడ్నిస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2010 జూలై 16న రిలీజైంది. కమర్షియల్గా ఈ సినిమా అంతగా ఆడకపోయినా.. విమర్శకుల నుండి ప్రశంసలు పొందింది. ఇదే కళాతపస్వి మెగాఫోన్ పట్టిన చివరి చిత్రం. ఇక నటుడుగా దాదాపు 31 సినిమాల్లో నటించాడు. ఆయన తెలుగులో నటించిన చివరి చిత్రం ‘హైపర్’. ఈ సినిమాలో సీఎం పాత్రలో నటించాడు. తెలుగులోనే కాకుండా హిందీలోనూ విశ్వనాథ్ పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు.