ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ నటిస్తున్న 30వ సినిమా ఇది కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నెల 24 లాంఛనంగా ప్రారంభం కావాల్సిన ఈ సినిమా తారకరత్న మరణంతో వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మార్చి 18న ప్రారంభించబోతున్నట్లు తెలిసింది. ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవం మార్చి 12న అమెరికాలోని లాస్ఏంజెల్స్లో జరగనుంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం ఇప్పటికే అమెరికా చేరుకుంది. త్వరలో ఎన్టీఆర్ సైతం అమెరికా పయనం కానున్నారు. ఈ నేపథ్యంలో అస్కార్ వేడుక పూర్తయ్యాకే ఎన్టీఆర్-కొరటాల శివ చిత్రాన్ని ప్రారంభిస్తారని, ఏప్రిల్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ను మొదలుపెడతారని సమాచారం. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నాయిక జాన్వీకపూర్ తెలుగులో అరంగేట్రం చేయబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.