‘కల్యాణ్రామ్ అన్న నా కంటే ఇండస్ట్రీలో సీనియర్. మా మొత్తం కుటుంబంలో ఎంతో మంది నటీనటులున్నా..అందరికంటే ఎక్కువ ప్రయోగాత్మక చిత్రాలు చేసింది కల్యాణ్రామ్ అన్న ఒక్కరే’ అని అన్నారు అగ్ర హీరో ఎన్టీఆర్. ఆదివారం జరిగిన ‘అమిగోస్’ చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కల్యాణ్రామ్ కథానాయకుడిగా రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఆషికా రంగనాథ్ కథానాయిక. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘ మా ఫ్యామిలీలో అటు నిర్మాతగా నటుడిగా ప్రయోజనాత్మక చిత్రాలు చేసింది కూడా అన్నయ్యే. ఆయన మాస్ సినిమాలు ఎప్పుడు చేస్తారా అని అనుకునేవాడిని. ఫైనల్గా బింబిసారతో ఆకలి తీర్చాడు. మూడు పాత్రలు చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు.
‘అమిగోస్’లో అన్నయ్య అద్భుతంగా నటించారు. కల్యాణ్రామ్ అన్న కెరీర్లో ఓ మైలురాయిలా నిలిచిపోతుందీ చిత్రం. సినిమా అప్డేట్స్ గురించి అభిమానులు పదేపదే అడగడం మంచిది కాదు. దానివల్ల దర్శకనిర్మాతలు ఒత్తిడికి గురవుతారు. ఏదైనా అప్డేట్ ఉంటే ముందుగా అభిమానులతోనే పంచుకుంటాం. కొరటాల శివతో నేను చేస్తున్న సినిమా షూటింగ్ మార్చిలో మొదలవుతుంది’ అన్నారు. కల్యాణ్రామ్ మాట్లాడుతూ ‘ ఒక యూనిక్ కాన్సెప్ట్తో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రపంచంలో మనలాగే ఏడుగురు మనుషులు ఉంటారని చెబుతారు. అలా మనిషిని పోలిన మనుషులు అనే కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కింది’ అన్నారు. ఈ సినిమాలో కల్యాణ్రామ్ పర్ఫార్మెన్స్ మరో స్థాయిలో ఉంటుందని దర్శకుడు తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘కల్యాణ్రామ్తో ఎప్పటి నుంచో సినిమా చేద్దామనుకుంటున్నాం. ఈ సినిమాతో కుదిరింది. తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది’ అన్నారు.