NTR 102 Birth Anniversary | విశ్వ విఖ్యత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు 102వ జయంతి సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్కి వెళ్లి తాతకి నివాళులు అర్పించారు. పుష్పగుచ్ఛాన్ని ఉంచి, నమస్కరించి నివాళి అర్పించారు. అనంతరం ఘాట్ వద్ద కాసేపు కూర్చుని తాత చేసిన సేవలని వారు గుర్తు చేసుకున్నారు. అనంతరం అక్కడి నుండి వెళ్లిపోయారు. ఎన్టీఆర్కు నివాళులర్పించేందుకు ఘాట్ వద్దకు ప్రముఖులు వస్తున్న సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
గత కొన్నేళ్లుగా ప్రతి ఏడాది తాత జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి నివాళులు అర్పిస్తూ ఉంటారు. ఆ సమయంలో అభిమానులు కూడా భారీ ఎత్తున అక్కడికి చేరుకుంటారు. అయితే సాధారణ ఉద్యోగి స్థాయి నుంచి నెంబర్ వన్ హీరోగా, ఆపై ముఖ్యమంత్రిగా జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఎన్టీఆర్. మే 28వ తేదీ ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ జయంతి వేడుకను అధికారికంగా నిర్వహించాలంటూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
ఎన్టీఆర్ సినిమా రంగంపై ప్రత్యేక ముద్ర వేశారు. తన కెరీర్లో ఎన్నో ప్రయోగాత్మక పాత్రలు పోషించి అదరహో అనిపించారు .’తోడుదొంగలు’ చిత్రంలో ముసలివాడిగా, ‘రాజుపేద’లో ఆకర్షణలేని వ్యక్తిగా, ‘కలిసిఉంటే కలదు సుఖం’చిత్రంలో వికలాంగుడిగా నటించి మెప్పించారు. ఇక ‘గుండిగంటలు’,’చిరంజీవులు’,’ఆత్మబంధువు’,’బడిపంతులు’ వంటి సినిమాల్లోను ఆయన నటనాశైలి విభిన్నంగా ఉండేవి. రాముడైనా, రావణుడైనా, కృష్ణుడైనా, దుర్యోధనుడైనా, కర్ణుడైనా, అర్జునుడైనా, భీముడైనా ఎన్టీఆర్ ఆ పాత్రలలో పూర్తిగా ఒదిగిపోయేవారు.