‘నాకు ఎవరినీ విమర్శించే ఉద్దేశ్యం లేదు. అయితే చాలా మంది జీవితా రాజశేఖర్ కుటుంబాన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. మంచి చేయాలనుకోవడమే మేము చేసిన తప్పా?’ అని ప్రశ్నించారు జీవితా రాజశేఖర్. ఈ నెల 10న జరగనున్న ‘మా’ ఎన్నికల్లో ఆమె ప్రకాష్రాజ్ ప్యానెల్ తరపున జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ ‘తప్పులు చేయడం మానవ సహజం. మేము వాటిని సరిదిద్దుకున్నాం. గత ‘మా’ ఎన్నికల్ల్లో నరేష్తో కలిసి పనిచేశాం. ఆయన చెప్పిన మాటలు నమ్మాం. ఆయన ఎవరిని తిట్టమంటే వారిని తిట్టాం. ఆ తర్వాత మా తప్పుల్ని తెలుసుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేశాం. ఈ క్రమంలోనే నరేష్తో మాకు విభేదాలొచ్చాయి. డైరీ విడుదల కార్యక్రమం నుంచే మనస్పర్ధలు మొదలయ్యాయి. నరేష్ ఎవరినీ కలుపుకొని పోలేదు. అందుకే ఇన్ని సమస్యలొచ్చాయి. మేము ఏం మాట్లాడినా నరేష్ తప్పుగా తీసుకునేవారు. ‘మా’ మెంబర్స్కు సినిమా అవకాశాలు కల్పించేందుకు ఓ వెబ్సైట్ను పెడదామన్నా అంగీకరించలేదు. జనరల్బాడీ మీటింగ్ పెడదామని కోరితే మాకు నోటీసులు పంపారు. ఇలా ఎన్నో తప్పులు చేస్తుంటే ఎలా కలిసుంటాం? ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే నేను సంతకం పెట్టలేదనే ఆరోపణలు చేశారు..వాళ్లు ఇల్లు కట్టిస్తానంటే నేనేమైనా ఇటుకలు, సిమెంట్ ఎత్తుకొచ్చానా? అని జీవిత ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మా’ఎన్నికల్లో ప్రాంతీయ వాదాన్ని ఎందుకు తీసుకొస్తున్నారని ఆమె ప్రశ్నించింది. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా ఉన్న వాళ్లు తెలుగువారా? అలాంటప్పుడు ప్రకాష్రాజ్ విషయంలో ప్రాంతీయ భేదాల్ని ఎందుకు తెస్తున్నారో అర్థం కావడం లేదు’ అని జీవిత పేర్కొంది.