లయన్ డా॥ సాయివెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జయహో రామానుజ’. సుదర్శనం ప్రొడక్షన్స్ పతాకంపై సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. రెండు భాగాలను తెరకెక్కిస్తున్నారు. తొలిభాగం ఈ జూలై 12న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నటుడు, దర్శకుడు సాయివెంకట్ మాట్లాడుతూ ‘కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఐకమత్యంతో జీవించాలని, మహిళలను గౌరవించాలని గొప్ప సందేశాన్నందించిన భగవత్ శ్రీరామానుజాచార్యుల వారి గురించి నేటి తరానికి తెలియజెప్పే చిత్రమిది’ అన్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను తెరకెక్కించామని నిర్మాతలు సాయిప్రసన్న, ప్రవళ్లిక తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.