కథా నేపథ్యానికి తగిన యాస భాషలు ఆ కథలోని పాత్రలకు సహజత్వాన్ని ఇస్తుంటాయి. ఆ యాసను సరిగ్గా పలికినప్పుడే ప్రేక్షకులు ఆ క్యారెక్టర్కు కనెక్ట్ అవుతారు. అలా ప్రేక్షకులను తన నటనతో మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నానని చెబుతున్నది బాలీవుడ్ తార జాన్వీ కపూర్. శ్రీదేవి నట వారసురాలిగా ‘దఢక్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్..‘గుంజన్ సక్సేనా’, ‘రూహీ’ లాంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపును దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె ‘గుడ్ లక్ జెర్రీ’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇది నయనతార నాయికగా నటించిన తమిళ సినిమా ‘కొలమావు కోకిల’కు హిందీ రీమేక్. సిద్ధార్థ్ సెన్గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బీహారీ యువతి పాత్రలో జాన్వీ కనిపించనుంది. ఈ పాత్ర కోసం ఇద్దరు టీచర్లను పెట్టుకుని బీహారీ యాస సాధన చేస్తున్నది. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ..‘ఈ సినిమా కోసం బీహారీ యాస నేర్చుకుంటున్నా. గణేష్, వినోద్ అనే ఇద్దరు టీచర్లు నాకు యాస సరిగ్గా పలికేలా శిక్షణ ఇస్తున్నారు. ఆ వర్క్ షాప్లకు రెగ్యులర్గా వెళ్తున్నా. బీహారీ యాసలో కొన్ని తిట్లు మాట్లాడటం కూడా నేర్పిస్తున్నారు. ఇలా సాధన చేయడం సరదాగా ఉంది’ అని చెప్పింది.