న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కరోనా నిబంధనలు, భౌతిక దూరం, లాక్డౌన్ వంటివి పాటించకపోతే కరోనా సోకిన వ్యక్తి ద్వారా నెల రోజుల్లో 406 మందికి వైరస్ వ్యాప్తిస్తుందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నిర్వహించిన ఒక అధ్యయనంలో గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో భౌతిక దూరం పాటించడం ఎంతో ముఖ్యమని నీతి ఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్ వీకే పాల్ అన్నారు. భౌతిక దూరం 50 శాతం మేర పాటిస్తే ఒక కరోనా రోగి ద్వారా నెల రోజుల్లో 15 మందికే వైరస్ సోకుతుందని తెలిపారు. భౌతిక దూరాన్ని 75 శాతం మేర పాటిస్తే ఒక కరోనా రోగి ద్వారా కేవలం 2.5 మంది మాత్రమే వైరస్ బారినపడతారని చెప్పారు.
ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు భౌతిక దూరమే ముఖ్యమని, మాస్కులు, శానిటైజర్లు వైరస్ వ్యాప్తి రిస్క్ను మాత్రమే తగ్గిస్తాయని డాక్టర్ వీకే పాల్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుని కరోనా నియంత్రణకు సహకరించాలని కోరారు. దయచేసి అనవసరంగా బయటకు వెళ్లవద్దని, ఇంట్లో కూడా కుటుంబ సభ్యులంతా మాస్కులు ధరించాలని, ఇతరులను ఇండ్లకు ఆహ్వానించవద్దని ఆయన సూచించారు.