ఇషాన్ ఖట్టర్, జాన్వీకపూర్ కీలక పాత్రల్లో నటించిన ‘హోమ్ బౌండ్’ చిత్రం ప్రతిష్టాత్మక కేన్స్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శితం కానుంది. ‘అన్ సర్టెన్ రిగార్డ్’ కేటగిరిలో ఈ సినిమాను స్క్రీనింగ్ చేయబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కళాత్మక విలువలతో రూపొందించిన చిత్రాలను ఈ విభాగంలో ప్రదర్శిస్తారు. హైదరాబాద్కు చెందిన నీరజ్ ఘైవాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన తొలిచిత్రం ‘మసాన్’ (2015) సైతం కేన్స్ ఫిల్మ్ఫెస్టివల్లో ప్రదర్శనకు ఎంపిక కావడం విశేషం. మే 13 నుంచి 24 వరకు ఫ్రాన్స్ వేదికగా జరగనున్న 78వ కేన్స్ ఫిల్మ్ఫెస్టివల్లో ‘హోమ్ బౌండ్’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. తన సినిమా కేన్స్కు ఎంపిక కావడం పట్ల జాన్వీకపూర్ ఇన్స్టా వేదికగా ఆనందం వ్యక్తం చేసింది. భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజెప్పిన క్షణాలివని, ఇది తన బృందం మొత్తానికి దక్కిన గౌరవమని వ్యాఖ్యానించింది. భారతీయ కథల గొప్పదనాన్ని ప్రపంచం గుర్తిస్తున్నదని చిత్ర నిర్మాతల్లో ఒకరైన కరణ్జోహార్ అన్నారు.