దక్షిణాది సంస్కృతి, సినిమాలు అంటే అమితమైన ఇష్టాన్ని ప్రదర్శిస్తుంది అగ్ర కథానాయిక జాన్వీకపూర్. తన తల్లి, లెజెండరీ నటి శ్రీదేవి తరహాలోనే ఇక్కడి ప్రేక్షకుల అభిమానాన్ని పొందాలన్నది తన లక్ష్యమని పలు సందర్భాల్లో చెప్పిందీ భామ. తెలుగు అరంగేట్ర చిత్రం ‘దేవర’తో యువ హృదయాల్ని దోచుకున్న ఈ సొగసరి ‘పెద్ది’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల్ని పలకరించబోతున్న విషయం తెలిసిందే. ఇదిలావుండగా దక్షిణాదిలో తన మార్కెట్ను మరింత విస్తృతం చేసుకునే దిశగా జాన్వీకపూర్ అడుగులు వేస్తున్నది.
ఈ నేపథ్యంలో ఆమె తమిళ సినీరంగంలో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిసింది. అగ్ర నటుడు విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా దర్శకుడు అరవింద్ కుమార్ ఓ న్యూఏజ్ లవ్స్టోరీని తెరకెక్కించబోతున్నాడు. ఇందులో జాన్వీకపూర్ కథానాయికగా ఖరారైందని సమాచారం. కథలోని కొత్తదనం, తన పాత్ర తీరుతెన్నులు నచ్చడంతో కోలీవుడ్ అరంగేట్రానికి ఇదే సరైన చిత్రమని ఆమె భావిస్తున్నదట.
త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ‘పెద్ది’ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ తమిళంలో ఈ సినిమాను తెరకెక్కిస్తుండటం విశేషం. ‘పెద్ది’లో అచ్చియమ్మగా తన అందచందాలు, అభినయంతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నదిజాన్వీకపూర్.