G. Marimuthu Passes Away | తమిళ నటుడు, దర్శకుడు G. మారిముత్తు మరణించాడు. తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో కటుంబ సభ్యులు దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు. చికిత్స జరుగుతుండగానే మారిముత్తు తుది శ్వాస విడిచాడు. ఆయన మరణంతో తమిళ ఇండస్ట్రీ షాక్కు గురైంది. మారి ముత్తు మరణం పట్ల పలువురు సెలబ్రెటీలు తీవ్ర సంతాపం ప్రకటిస్తున్నారు. ఇక మారిముత్తు రెండు దశాబ్దాలుగా తమిళ ఇండస్ట్రీలో బిజీయెస్ట్ నటుడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఆయన వందకు పైగా సినిమాల్లో నటించాడు. కేవలం నటుడుగానే కాకుండా రెండు సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు.
మారి ముత్తు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. నేరుగా తెలుగులో ఆయన నటించకపోయినా.. పలు తమిళ డబ్బింగ్ సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులను పలకరించాడు. చినబాబు, పందెం కోడి-2, సుల్తాన్, డాక్టర్ వంటి సినిమాల్లో కీలకపాత్రలు పోషించాడు. ఎక్కువగా నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనే మారిముత్తు కనిపించాడు. ఇక ఇటీవలే రిలీజైన జైలర్లో విలన్కు నమ్మకస్తుడిగా కీలకపాత్ర పోషించాడు. శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్-2లోనూ మారిముత్తు నటించాడు.
మారిముత్తు పలు తమిళ సీరియల్స్లోనూ నటించాడు. ఇక 2008లో హీరోయిన్ స్నేహ భర్త ప్రసన్నను హీరోగా పెట్టి కన్నుమ్ కన్నుమ్ అనే సినిమా తెరకెక్కించాడు. కమర్షియల్గా ఈ సినిమా పెద్దగా ఆడలేదు కానీ.. దర్శకుడిగా మారిముత్తుకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఆరేళ్లకు పులివల్ అనే థ్రిల్లర్ సినిమా చేశాడు. అయితే ఈ సినిమా డిజాస్టర్గా మిగిలింది. ఇక ఆ తర్వాత నటుడిగా తెగ బిజీ అవడంతో మెగాఫోన్ మళ్లీ పట్టేలేదు.