J.D.Chakravarthy | ముప్పై నాలుగేళ్ల క్రితం రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ సినిమాలో ఓ చిన్న రోల్లో మెరిసాడు జేడీ చక్రవర్తి. అదే రామ్గోపాల్ వర్మ నాలుగేళ్ల తర్వాత జేడీ చక్రవర్తిని హీరోగా పెట్టి మనీ అనే కామెడీ థ్రిల్లర్ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా అప్పట్లో సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో జేడీ చక్రవర్తి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత గులాబీ, దెయ్యం, బాంబే ప్రియుడు వంటి హిట్లతో స్టార్ ఇమేజ్ దక్కించుకున్నాడు. అదే టైమ్లో సత్యతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చి.. అక్కడ కూడా సెన్సేషనల్ హిట్టు అందుకున్నాడు. ఆ తర్వాత ఇటు దక్షిణాన, అటు ఉత్తరాదిన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ పోయాడు. హీరోగానే కాకుండా విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా జేడీ పలు సినిమాలు చేశాడు.
అయితే గతకొంత కాలంగా జేడీ చక్రవర్తి ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా తెలుగులో నాలుగేళ్లుగా ఒక్క సినిమా కూడా చేయలేదు. కాగా ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. దయా టైటిల్తో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 4నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ తాజాగా రిలీజైంది.
కవిత అనే ఒక రిపోర్టర్ మిస్సింగ్ కేసుతో ట్రైలర్ ప్రారంభమైంది. చేపలను పంపిణీ చేసే ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్గా జేడీ చక్రవర్తి ఇందులో నటించాడు. కాగా జేడీ నడుపుతున్న వ్యాన్లో మిస్సయిన కవిత శవమై కనిపిస్తుంది. ఆ శవాన్ని చూసి భయపడిపోయిన జేడీ.. ఎవరికీ తెలియకుండా శవాన్ని పారవేసేందుకు ప్రయత్నిస్తాడు. అయితే అదే సమయంలో తననే ప్రధాన నిందితుడిగా భావించి పోలీసులు వెంబడిస్తుంటారు. కాగా కవితను ఎవరు హత్య చేసి ఉంటారు? కవిత శవం ఆ వ్యాన్లోకి ఎలా వచ్చింది? ఆ శవానికి, జేడీకి ఉన్న సంబంధం ఏంటి అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే మరో మూడు వారాల్లో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయ్యే ఈ వెబ్సిరీస్ను చూడాల్సిందే.
ట్రైలర్ మొత్తం ఉత్కంఠ భరితంగా సాగింది. ముఖ్యంగా చైతన్య భరద్వాజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థ్రిల్ ఫీల్ను కలిగిస్తుంది. కమల్ కామరాజు, జోష్ రవి, విష్ణు ప్రియలు కీలకపాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్లో జేడీ చక్రవర్తికి భార్యగా హీరోయిన్ ఈషా రెబ్బా నటించింది.