‘జైలర్’ చిత్రంతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు అగ్ర హీరో రజనీకాంత్. ఆయన తదుపరి చిత్రానికి ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించబోతున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ నటిస్తున్న 170వ చిత్రమిది కావడం విశేషం. ఈ సినిమాలో తెలుగు యువ హీరోలు నాని లేదా శర్వానంద్ భాగం కాబోతున్నారని కొద్ది రోజుల క్రితం వార్తలొచ్చాయి.
ఆ తర్వాత రానా పేరు కూడా వినిపించింది. తాజాగా ఈ సినిమాలో రానా నటించబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఆయన రాకతో ‘తలైవా 170’ చిత్రం మరింత ఆసక్తికరంగా మారిందంటూ ట్వీట్ చేసింది. ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా నటించనున్నారు. దాదాపు 32 ఏళ్ల విరామం తర్వాత అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ కలిసి నటిస్తుండటం విశేషం. ఈ సినిమాలో మంజూ వారియర్, రితికాసింగ్, దుషారా విజయన్ కథానాయికలుగా ఖరారయ్యారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నది.