యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. శ్రీమతి విజయలక్ష్మి సమర్పణలో బలగ ప్రకాష్ నిర్మించారు. మే 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ..‘కొందరు వ్యక్తుల జీవితాల నుంచి స్ఫూర్తి పొంది నేను రాసుకున్న కథ ఇది. కల్పిత సన్నివేశాలుంటాయి. కథ ఆధారంగానే టైటిల్ పెట్టాం. తన సమస్యలపై పోరాడిన జయమ్మ అనే మహిళ కథను తెరపై చూస్తారు.
సంపన్న కుటుంబం నుంచి వచ్చినా గ్రామంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతుందామె. సమస్యలపై ఆమె చేసే పోరాటం పెద్ద వివాదం అవుతుంది. ఒక బలమైన సమస్యపై జయమ్మ చేసే పోరాటం ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలోని నాలుగు పాటలు కథను సందర్భానుసారం ముందుకు తీసుకెళ్తాయి. సుమ లేకుంటే ఈ సినిమా జరిగేది కాదు. ఆమె తన అభినయంతో ఆకట్టుకుంటుంది. మా చిత్రానికి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, రాజమౌళి వంటి వాళ్లు ప్రచారం చేయడం సంతోషం కలిగించింది’ అన్నారు.