Naatu Naatu Song | దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. కమర్షియల్గానే కాదు అవార్డుల పరంగానూ ఈ సినిమా దూసుకెళ్తుంది. తాజాగా ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డును ట్రిపుల్ఆర్ సొంతం చేసుకుంది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘నాటు నాటు’ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుంది. ఆసియా నుండి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న తొలి పాట ఇదే కావడం విశేషం. ఈ అవార్డు గెలుచుకోవడం పట్ల పలువురు సినీ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ బృందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా అసలు ఈ పాట ఎలా పుట్టింది? ఈ పాట కోసం రాజమౌళి ఎన్ని టేకులు తీసుకున్నాడు? కీరవాణి ఎన్ని ట్యూన్స్ కంపోజ్ చేశాడు? చంద్రబోస్కు ఈ పాట రాయడానికి ఎంత సమయం పట్టింది? ప్రేమ్ రక్షిత్ ఈ పాట కోసం ఎన్ని వేరియేషన్స్ చూపించాడు? ఇలా వీటిన్నిటి గురించి ఓ లుక్కేద్దాం.
ఆరేళ్ల పసివాళ్ల నుండి అరవై ఏళ్ల వృద్ధుల వరకు అందరినీ ఈ పాట ఉర్రూతలూగించింది. సినిమా రిలీజయ్యే సమయానికి ఈ పాట ఒక సంచలనంగా మారింది. అప్పటికే ఆర్ఆర్ఆర్పై ఉన్న బజ్కు ఈ పాట తోడవడంతో సినిమాపై ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ఈ పాట కోసం ప్రత్యేకంగా థియేటర్లకు వెళ్లిన వాళ్లు ఎందరో ఉన్నారు. కాగా అసలు ఈ పాట ఎలా పుట్టిందో తెలుసుకుందాం.. ఇండియాలోని బెస్ట్ డ్యాన్స్ర్ల లిస్ట్ తీస్తే అందులో చరణ్, తారక్ల పేర్లు కచ్చితంగా ఉంటాయి. విడివిడిగా వీళ్లిద్ధరి నృత్యాల్ని చూసి ఆహా.. ఓహో అంటూ లెక్కలేనన్ని సార్లు అనుకున్నాం. అలాంటిది ఇద్ధరు కలిసి ఒకే సారి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అని రాజమౌళి ఆలోచించాడట.
ఆలోచనే తడువుగా కీరవాణిని పిలిపించి.. చరణ్, తారక్లు ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేయడానికి ఒక మాస్ పాట కావాలి అని అన్నాడట. మాములుగానే రాజమౌళి తన పాటలను ఒక రేంజ్లో తెరకెక్కించాలనుకుంటాడు. అలాంటిది ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్ల కోసం పాటంటే ఇంకే రేంజ్లో ఆలోచించాడో అని కీరవాణి గ్రహించాడు. ఈ పాటను ఎలా స్టార్ట్ చేయాలి అని ఆలోచించినప్పుడు ఠక్కున గుర్తొచ్చిన పేరు చంద్రబోస్. అప్పటికే కీరవాణి స్వర పరిచిన ఎన్నో పాటలకు చంద్రబోస్ సాహిత్యం అందించాడు. దాంతో ఇలాంటి మాస్ బీట్ సాంగ్కు చంద్రబోస్ అయితేనే న్యాయం చేస్తాడని కీరవాణి ఆయన్ని పిలిపించాడు.
ఇద్దరు హీరోలు డాన్సులతో అదరగొట్టాలి. మీకు ఏం నచ్చితే అది రాయండి. కానీ ఈ కథ 1920 ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి ఆ కాలానికి తగిన మాటలు వాడాలి అంటూ చంద్రబోస్కు కీరవాణి చెప్పాడట. ఇక చంద్రబోస్ సరేనని చెప్పి వెళ్లిపోయాడు. చేతులు కారు స్టీరింగ్ పైనే ఉన్నా.. చంద్రబోస్ ఆలోచనల్లో మాత్రం ఎలాంటి పాట రాయాలి అని తిరుగుతుంది. అలా ఆలోచనలోంచి పుట్టిన పదమే ‘నాటు నాటు’. అప్పటికి ఈ పాటకు ట్యూన్ అంటూ ఏమిలేదు. కానీ చంద్రబోస్ తన వెర్షన్లో సాహిత్యాన్ని అల్లుకుంటూ పోయాడు.
రెండు రోజుల్లో మూడు పల్లవులు రాసుకుని కీరవాణి ముందుట ఉంచాడు. అందులో ‘పొలం గట్టు’తో సాగే పల్లవిని రాజమౌళి, కీరవాణిలు ఒకే చేశారు. అందులో ‘నా పాట చూడు’ అనే పదానికి ముందుగా చంద్రబోస్ ‘నా పాట పాడు’ అనే పదాన్ని రాశాడు. దాన్ని కీరవాణి ‘నా పాట చూడు’గా మార్చాడు. ఇక అప్పుడే ఈ పాట 90శాతం పూర్తయి పోయింది. ట్యూన్ కూడా సిద్ధమైంది. కానీ మార్పులు, చేర్పులు చేస్తూ.. నాటు నాటు పాట పూర్తి స్థాయిలో సిద్ధం కావడానికి దాదాపు 19 నెలలు పట్టింది.
ఫైనల్గా పాట ఓకే అయిపోయింది. చిత్ర యూనిట్ పాటను చిత్రీకరించడానికి ఉక్రెయిన్ వెళ్లింది. పాటను చిత్రీకరిస్తున్న సమయంలోనే రాజమౌళికి ఏదో అసంతృప్తి. వెంటనే చంద్రబోస్కు కాల్ కలిపి చివరి రెండు లైన్లు మార్చాలని చెప్పాడు. చంద్రబోస్ కూడా పదిహేను నిమిషాల్లోనే రెండు లైన్లను మార్చాడు. ఇలా ఒక్క పాట కోసం 19నెలలు పట్టడం ఇదే తొలిసారి అని చంద్రబోస్ ఓ ఇంటర్వూలో తెలిపాడు.
ఇక పాట ఓకే అయింది. మరి నృత్య కళాకారుడు ఎవరు అనే ఆలోచన రాజమౌళిలో మెదిలింది. అప్పుడే తన సినిమాల్లో ఎన్నో పాటలకు నృత్యాలను సమకూర్చిన ప్రేమ్ రక్షిత్ను పిలిపించాడు. ఇక ప్రేమ్ రక్షిత్ ఈ పాట కోసం దాదాపు 95 స్టెప్పులు కంపోజ్ చేశాడు. తారక్, చరణ్లు భూజాలపై చేతులేసుకుని వేసిన హూక్ స్టెప్ కోసం ఏకంగా 30 వెర్షన్లు రెడీ చేశాడు. ఆ స్టెప్ పర్ఫెక్ట్గా మానిటర్పై కనబడానికి రాజమౌళి 19 టేకులు తీసుకున్నాడు. కానీ చివరికి రెండో టేకునే ఓకే చేశాడు.
ఇలా ఒక్క పాట కోసం ఆర్ఆర్ఆర్ బృందం చిన్నపాటి యుద్దమే చేసింది. అంత కష్టపడ్డారు గనుకే ఈ పాటకు ఇప్పుడు గ్లోబల్గా ప్రశంసలు దక్కుతున్నాయి. హాలీవుడ్ ప్రేక్షకులు సైతం నాటు నాటు పాటకు స్టెప్పులేస్తూ రీల్స్ చేస్తున్నారు. ఈ పాటలో కేవలం తారక్, చరణ్ నాట్య ప్రతిభే కాదు, వాళ్లిద్ధరి మధ్య స్నేహబంధం ఎలాంటిదో తెలిపారు. తెల్లవాళ్ల ముందు తెలుగువాడి సత్తా ఏంటో చూపించారు. మరోవైపు ఈ పాట ఆస్కార్ షార్ట్ లిస్టులోనూ ఉత్తమ సాంగ్ విభాగంలో చోటు దక్కించుకుంది.