ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే అంకితభావంతో పనిచేయడంతో పాటు ఓర్పు చాలా అవసరమని చెబుతోంది మంగళూరు సొగసరి పూజాహెగ్డే. తన కెరీర్ తొలినాళ్లు అనేక ఒడిదుడుకులతో సాగాయని, ప్రస్తుతం దక్షిణాదితో పాటు హిందీ చిత్రసీమలో కూడా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయని ఈ అమ్మడు ఆనందం వ్యక్తం చేసింది. వైఫల్యాల్లో సహనాన్ని కలిగి ఉండటమే తన విజయాలకు కారణమని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘కెరీర్ ఆరంభంలో వరుస వైఫల్యాలు పలకరించాయి. అధైర్యపడకుండా నాదైన సమయం కోసం ఎదురుచూశా. కష్టపడే తత్వాన్ని విడిచిపెట్టకుండా అవకాశాల కోసం ప్రయత్నించా. చివరకు విజయాలు వరించాయి. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఈ స్థాయికి రావడం గర్వంగా భావిస్తున్నా. నా ప్రయాణాన్ని తరచి చూసుకుంటే ఇంకా వెళ్లాల్సిన దూరం చాలా ఉందనిపిస్తోంది’ అని చెప్పింది. కథాంశాల ఎంపికలో తన పాత్ర నిడివి గురించి ఆలోచించనని..కథతో పాటు పాత్ర చిత్రణ బాగుండాలని చెప్పింది. ‘ఒక్కోసారి సబ్జెక్ట్ బాగున్నా.. కథానాయిక క్యారెక్టరైజేషన్ పేలవంగా అనిపిస్తుంది. అలాంటి సినిమాల్ని తిరస్కరిస్తా. అలాగే ప్రతిభావంతులైన దర్శకులు, గొప్ప నిర్మాణ సంస్థలు తీసే సినిమాల్ని కూడా మిస్ చేసుకోను’ అని చెప్పింది. ప్రస్తుతం పూజాహెగ్డే తెలుగులో మూడు చిత్రాల్లో నటిస్తోంది.