మస్త్ అలీ, అజీజ్ నజీర్, ఎలీనా టుతేజా ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘ఫస్ గయే యారో’. యూసఫ్ సర్తి దర్శకుడు. రూపేష్ డి. గోహిల్ నిర్మిస్తున్నారు. ఈ నెల 21న విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘నిర్మాత రూపేష్తో నాకు పదిహేనేళ్లుగా పరిచయముంది. మేమిద్దరం కలిసి రెండు సినిమాలు నిర్మించాం. దక్కన్ కామెడీతో ఆయన నిర్మించిన ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముంది’ అని తెలిపారు. ‘హారర్ ఎంటర్టైనర్ ఇది. సినిమా బ్యాక్డ్రాప్లో ఆద్యంతం వినోదాన్ని పంచుతుంది. మస్త్ అలీ, అజీజ్ నజీర్ కాంబినేషన్లో వచ్చే ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటుంది’ అని దర్శకుడు అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ మైనారిటీ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.