తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం హీరోగానే కాకుండా విలన్గాను, ఇతర పాత్రలలోను కనిపించి మెప్పిస్తున్నాడు. ఆయనపై ఇటీవల బెంగళూరు ఎయిర్పోర్ట్లో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ గొడవ తర్వాత హిందూ మక్కల్ కట్చి అనే ఒక హిందూ సంస్థ విజయ్ సేతుపతిని తన్నిన వారికి రూ. 1,001 బహుమతిని ప్రకటించి కలకలం రేపింది.
విజయ్ సేతుపతి స్వాతంత్ర్య సమరయోధుడు దైవతిరు పసుంపోన్ ముత్తురామలింగ తేవర్ అయ్య మరియు దేశాన్ని అవమానించాడని వీడియో ఒక దానిని పోస్ట్ చేసింది. అలా “తేవర్ అయ్యను అవమానించినందుకుగాను ఎవరైతే నటుడు విజయ్ సేతుపతిని తన్నుతారో, వారికి బహుమతి ఉంటుందని పేర్కొంది. ఒకసారి తంతే వారికి రూ. 1001 ఇస్తామని ఆ సంస్థ చీఫ్ అర్జున్ సంపత్ నగదు బహుమతి ప్రకటించారు.అతను క్షమాపణ చెప్పే వరకు తన్నాలని కూడా వారు పేర్కొన్నారు.
విజయ్ సేతుపతిని తన్నడానికి ప్రయత్నించిన వ్యక్తి మహాగాంధీతో తాను మాట్లాడానని, విజయ్ సేతుపతి అతనితో చాలా హేళనగా మాట్లాడాడని, అది వాగ్వాదానికి దారి తీసిందన్నారు అర్జున్ సంపత్. విజయ్ సేతుపతికి జాతీయ అవార్డు వచ్చినందుకు అతను విషెస్ చెప్పాలనుకున్నాడని, కానీ విజయ్ వ్యంగ్యంగా స్పందించాడని, ప్రపంచంలో ఏకైక దేవుడు జీసస్ మాత్రమే అని విజయ్ చెప్పాడని, అందుకే అతను అలా రియాక్ట్ అయ్యాడని అర్జున్ సంపత్ తెలిపారు. అందుకే తాను ఈ నగదు బహుమతి ప్రకటించినట్టు తెలిపారు. మరి ఈ వివాదంపై విజయ్ సేతుపతి ఎలా స్పందిస్తాడో చూడాలి.