“హాయ్ నాన్న’ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎలాంటి హింస, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు. తండ్రీకూతురు అనుబంధానికి దర్పణంలా నిలుస్తుంది’ అన్నారు దర్శకుడు శౌర్యువ్. ఆయన నిర్దేశకత్వంలో నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శనివారం దర్శకుడు శౌర్యువ్ పాత్రికేయులతో పంచుకున్న విశేషాలు..
నాలుగేళ్ల క్రితం ఈ కథ రాసుకున్నా. నానికి కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. వెంటనే సినిమాకు ఓకే చెప్పాడు. ఆరు నెలల పాటు ప్రీప్రొడక్షన్ వర్క్ జరిపి షూటింగ్ మొదలుపెట్టాం. తండ్రీకూతురు అనుబంధం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. సింగిల్ ఫాదర్ మళ్లీ ప్రేమలో పడితే అనే కాన్సెప్ట్తో గతంలో కుచ్ కుచ్ హోతా హై, సంతోషం వంటి చాలా సినిమాలొచ్చాయి. అయితే ఆ సినిమాలతో మా కథకు ఎలాంటి సంబంధం ఉండదు. సమాజంలో జరుగుతున్న చాలా అంశాలను ఈ సినిమాలో చూపించాను.
ట్రైలర్లోనే కథ ఎలా ఉండబోతుందో తెలియజేశాం. ఇప్పటి పరిస్థితుల్లో చెప్పాల్సిన బలమైన పాయింట్ అనిపించింది. చక్కటి కుటుంబ కథగా హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలతో ఈ సినిమా ఆకట్టుకుంటుంది. మామూలుగా అయితే పిల్లలకు సంబంధించిన సగం బాధ్యతలను తల్లి తీసుకుంటుంది. సింగిల్ పేరెంట్ ఫాదర్ విషయంలో మాత్రం అతనే పూర్తి బాధ్యతలు తీసుకోవాలి. పిల్లల చుట్టూ తన జీవితాన్ని నిర్మించుకోవాలి. ఆ తండ్రి భావోద్వేగాలు, సంఘర్షణ ఎలా ఉంటుందనే అంశాలను ఈ సినిమాలో ఆవిష్కరించాను. నాని పాత్ర ఆద్యంతం ఎమోషనల్గా సాగుతుంది. ఈ కథ విషయంలో ఆయన విలువైన సలహాలిచ్చారు. మృణాల్ ఠాకూర్ తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. ఈ సినిమాలో శృతిహాసన్తో పాటు ఒకటి రెండు సర్ప్రైజింగ్ పాత్రలు ఉంటాయి. దర్శకుడిగా నా బలం ఎమోషన్. కమర్షియల్ చిత్రాల్లో కూడా ఎమోషన్స్ మిస్ చేయను. నా తదుపరి సినిమా వివరాలను త్వరలో వెల్లడిస్తా.