‘ప్రేమ అనేది ఎప్పుడూ ఒకేలా వుంటుంది. ఒకరు ప్రేమించడం.. మరొకరు తిరస్కరించడం.. మనస్పర్థలు రావడం.. విడిపోవడం.. మళ్లీ కలవడం.. అయితే కథను ఎంత యునిక్గా చెబుతున్నామనేది ఇక్కడ ముఖ్యం’ అన్నారు సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్. ఆయన స్వరాలందించిన చిత్రం ‘హాయ్ నాన్న’. నాని, మృణాళ్ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి శౌర్యువ్ దర్శకుడు. బేబీ కియారా, శ్రుతిహాసన్ కీలక పాత్రధారులు. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్రెడ్డి నిర్మాతలు.
ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్బంగా హేషమ్ అబ్దుల్ వహాబ్ మీడియాతో ముచ్చటించారు. ‘దర్శకుడు శౌర్యువ్ ఈ చిత్రాన్ని వెరీ సాఫ్ట్ రొమాంటిక్గా తెరకెక్కించాడు. సంగీతాన్ని కూడా అంతే సాఫ్ట్గా తీసుకున్నాడు. ఈ సినిమాలోని లైటింగ్ విజువల్స్, మ్యూజిక్ అన్నీ దర్శకుడి అభిరుచికి తగ్గట్టు ఆహ్లాదకరంగా ఉంటాయి’ అని చెప్పారు హేషమ్ అబ్దుల్ వహాబ్.
పాటలోని సాహిత్యం లలితంగా ఉంటే పాట త్వరగా జనాల్లోకి వెళుతుందని, ఈ సినిమాలోని పాటలను దర్శకుడు అద్భుతంగా ప్రజెంట్ చేశాడని, గాజుబొమ్మ, సమయమా, అమ్మాడి పాటలు వినడానికే కాదు, విజువల్గా కూడా బావుంటాయని ఆయన చెప్పారు. తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన గొప్ప కథల్లో ‘హాయ్ నాన్న’ ఒకటిగా నిలుస్తుందని, నటీనటులందరూ అద్భుతంగా నటించారని, ఈ సినిమాకోసం 15మంచి మ్యుజిషియన్స్ దాదాపు 40రోజులపాటు కష్టపడి పనిచేశారని అబ్దుల్ వహాబ్ తెలిపారు.