కరోనా మహమ్మారి కారణంగా ఉపాధిని కోల్పోయి ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు నిర్మాతలు దిల్రాజు, చదలవాడ శ్రీనివాస్, యలమంచిలి రవిచంద్ అండగా నిలిచారు. ‘కళామతల్లి చేదోడు’ పేరుతో బుధవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కార్మికులకు నెల రోజులకు సరిపడా నిత్యావసరాల్ని అందజేశారు. ఈ సందర్భంగా యలమంచిలి రవిచంద్ మాట్లాడుతూ ‘ప్రస్తుత కష్టకాలంలో పేద సినీ కార్మికులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. వారందరిని ఆదుకోవాలనే లక్ష్యంతో ‘కళామతల్లి చేదోడు’ కార్యక్రమం మొదలుపెట్టాం. తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు వేల మంది కార్మికులున్నారు. వారందరికి ఒకేసారి నిత్యావసరాల్ని అందించడం సాధ్యంకాదు. అందుకే మొదటి విడతగా ఈ రోజు 600 మందికి సాయం చేశాం. దశలవారీగా మిగతా కార్మికులను ఆదుకుంటాం’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెక్కెం వేణుగోపాల్, అజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.