ఒక్క సినిమాతో భారతీయ సినీపరిశ్రమంతా తనవైపు చూసేలా చేసిన దర్శకుడు ఏఆర్ మురుగదాస్. ఆ సినిమానే ‘గజనీ’. తమిళ, తెలుగు భాషల్లోనే కాదు, బాలీవుడ్లో పునర్నిర్మిస్తే, అక్కడ కూడా అఖండ విజయాన్ని సాధించిందా సినిమా. ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ‘గజనీ’ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్న సినీ ప్రియులు కోకొల్లలు. దర్శకుడు మురుగదాస్ తన తాజా సినిమా సల్మాన్ఖాన్ ‘సికిందర్’ ప్రమోషన్స్లో బిజీగా బిజీగా ఉన్నారు. ఈ సందర్భంలో కొందరు అభిమానులు ఆయన్ను ‘గజనీ’ సీక్వెల్ గురించి అడగ్గా.. వారందరికీ మురుగదాస్ శుభవార్త చెప్పేశారు. ‘ ‘గజనీ 2’ రూపొందే అవకాశం ఉంది. ఆ పాత్రను ఆధారంగా చేసుకుని ఎన్ని పార్ట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. సీక్వెల్ విషయంలో నా దగ్గర ఓ ఆలోచన ఉంది. దానిపై వర్క్ చేయాలి. ఫుల్ స్క్రిప్ట్ని సిద్ధం చేయాలి. అనుకున్నట్టు అంతా మంచి జరిగితే.. కచ్ఛితంగా ‘గజనీ 2’ తీస్తా. తెలుగు, తమిళంలో ఒకేసారి తీయాలనే ఆలోచన కూడా ఉంది.’ అన్నారు మురుగదాస్.