రాజమౌళి కుటుంబం నుంచి అందరూ టెక్నీషియన్స్ ఉన్నారు. అక్కడ నుంచి నటులు చాలా తక్కువ.. ఇంకా చెప్పాలంటే కేవలం ఒక్కరు మాత్రమే నటన రంగంలోకి వచ్చారు. అతను ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కీరవాణి చిన్న కొడుకు సింహ కోడూరి. ఈయన కూడా ముందు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి.. ఆ తర్వాత హీరోగా యూటర్న్ తీసుకున్నాడు. రంగస్థలం సినిమా సమయంలో సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడు సింహ. ఆ తర్వాత మత్తు వదలరా సినిమాతో హీరోగా మారాడు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఆ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఆ తర్వాత చేసిన తెల్లవారితే గురువారం ఎప్పుడు వచ్చి వెళ్ళిపోయిందో కూడా తెలియదు. ఇదిలా ఉంటే తాజాగా దొంగలున్నారు జాగ్రత్త అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సింహ. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు సతీష్ త్రిపుర తెరకెక్కిస్తున్నాడు. సెప్టెంబర్ 23న ఈ సినిమా విడుదల కానుంది. సింహ కోడూరి కెరీర్కు దొంగలున్నారు జాగ్రత్త అత్యంత కీలకంగా మారింది. సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ సినిమా వస్తుంది హీరోగా ఈయన కెరీర్ నిలబడాలి అంటే దొంగలున్నారు జాగ్రత్త కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయాల్సిందే.
ఆయనకు మరో ఆప్షన్ కూడా లేదు. రాజమౌళి కుటుంబం నుంచి వచ్చినా కూడా.. సొంతంగా ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు సింహ. కావాలంటే భారీ బడ్జెట్ తో సినిమా చేసే అవకాశం ఉన్నా.. కొత్త దర్శకులతో తనను తాను నిరూపించుకోవాలని చూస్తున్నాడు కీరవాణి వారసుడు. కొండంత బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా దాన్ని ఉపయోగించుకోవాలని ఏ రోజు అనుకోవడం లేదు. అందుకే ఈరోజు కాకపోయినా రేపటి రోజు కచ్చితంగా సింహ సక్సెస్ అవుతాడు అంటూ రాజమౌళి ఫ్యాన్స్ ధీమాగా చెబుతున్నారు. ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని సింహా కూడా వెయిట్ చేస్తున్నాడు.