ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఆయన సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో చిత్రం ‘హను-మాన్’. తేజ సజ్జా హీరోగా ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కే నిరంజన్రెడ్డి నిర్మించారు. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి చక్కటి ఆదరణ లభిస్తున్నది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శనివారం గ్రాటిట్యూడ్ మీట్ నిర్వహించింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. నిరంజన్ గారి లాంటి నిర్మాత దొరకడం మా అదృష్టం. ‘హను-మాన్’ విజయం ప్రేక్షకులదే. ఎన్నో క్లోజింగ్ థియేటర్స్ ఈ సినిమాతో ఓపెన్ కావడం ఆనందాన్నిచ్చింది. మూడో వారంలోనూ హౌస్ఫుల్ బోర్డు చూడటం మేకర్స్కి గొప్ప తృప్తినిస్తుంది. ఈ సినిమా ఇంకా చాలా రోజులు ఆడుతుంది. ‘హను-మాన్’కు చాలా వేడుకలు చేయనున్నాం.
ఈ సినిమాకు పనిచేసినవాళ్లందరికి గిఫ్ట్స్ ఉండబోతున్నాయి. ప్రేక్షకులు ‘హను-మాన్’ సినిమాను చూస్తూ థియేటర్లను దేవాలయాలుగా భావిస్తున్నారు. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరూ అయోధ్య ఆలయానికి ఐదు రూపాయలు విరాళం చేస్తున్నారు. ఈ సినిమా లాభాలను దేవుళ్లకు, సినిమాలు తీయడానికే ఖర్చు పెడతాం. ఈ చిత్ర సీక్వెల్ ‘జై హనుమాన్’తో అందరి రుణం తీర్చుకోబోతున్నాను. ‘హను-మాన్’ కన్నా ‘జై హనుమాన్’ వందరెట్లు గొప్పగా ఉంటుంది. ఇంటర్నేషనల్ సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాం’ అన్నారు. హీరో తేజ మాట్లాడుతూ ‘సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు పాదాభివందనం’ అని అన్నారు.