బిగ్బాస్ ప్రవేశపెట్టిన ‘రాజ్యానికి ఒక్కడే రాజు’ టాస్క్ రసవత్తరంగా సాగుతున్న క్రమంలో కొందరు కాయిన్స్ దొంగతనం చేయడంతో విశ్వ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దమ్ముంటే ఆడి గెలవాలి.. అంతేకాని ఈ దొంగ బుద్దులు ఏంటి? గుంటనక్కలు చాలామంది ఉన్నారు అని రెచ్చిపోయాడు. దీంతో మానస్కి ఒళ్లు మండింది. అందరిని కలిపి అనకు అనడంతో వివాదం మరింత ముదిరింది.
కాయిన్స్ కొట్టేసిన సిరి, షణ్ముఖ్లు మాత్రం మంచిగా దుప్పట్లొకి దూరి కాయిన్స్ పంచుకున్నారు అయితే టాస్క్లో రవి టీం 2-1 తేడాతో సన్నీ టీంపై గెలిచింది. అనంతరం హౌజ్ మేట్స్ అందరు పడుకున్నారు. శ్రీరామ్- హమీదా మాత్రం హగ్గులు,గాలిలో కిస్సులు విసురుకుంటూ హడావిడి చేశారు. హమీదా అయితే శ్రీరామ్ కౌగిలి నుంచి బయటకు రావడానికి అస్సలు ఇష్టపడలేదు. వీళ్ల యవ్వారం చూస్తే గత సీజన్లో అఖిల్, మోనాల్లు గుర్తుకు వస్తున్నారు.
అనంతరం బిగ్బాస్ ఇంటిసభ్యులకు ‘రాజుగారి గోడ’ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఖాళీ గోడలపై హౌస్మేట్స్ వారికి నచ్చిన రాజు ఫొటోలను అతికించాల్సి ఉంటుంది. ఎండ్ బజర్ మోగే సమయానికి ఏ రాకుమారుడి ఫొటోలు ఎక్కువ ఉంటే అతడే గెలిచినట్లు లెక్క అని బిగ్ బాస్ చెప్పారు. సన్నీకి సపోర్ట్గా మానస్, జెస్సీ బరిలోకి దిగగా, రవికి మద్దతుగా విశ్వ, శ్రీరామ్ వచ్చాడు.
విశ్వను ఆపేందుకు మానస్ గట్టిగా ప్రయత్నించగా, శ్రీరామ్ని జెస్సీ ఎత్తి కింద పడేశాడు. దీంతో శ్రీరామ్.. గోడనే కూల్చాడు. హౌజ్ ప్రాపర్టీని అలా ఎందుకు కూల్చావని హౌజ్మేట్స్ శ్రీరామ్కి చురకలు అంటించారు. చివరగా ఈ టాస్క్లో యువరాజు సన్నీ విజయం సాధించడం విశేషం.