గోపీచంద్ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘విశ్వం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, వేణు దోనెపూడి నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్లో వేగం పెంచారు. మంగళవారం ‘మొండితల్లి పిల్ల నువ్వు’ అనే పాటను విడుదల చేశారు. చేతన్ భరద్వాజ్ స్వరపరచిన ఈ పాటను శ్రీహర్ష రచించారు.
తల్లీకూతుళ్ల బంధాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. ‘అడుగే తడబడితే..ఇదిగో నీ వెనకే ఉంటానులే..చిన్నారి తల్లి…కలలో భయపడకు..ఎపుడూ నీ కునుకై ఉంటానులే చిన్నారి తల్లి..మొండితల్లి పిల్ల నువ్వు’ అంటూ ఎమోషనల్గా ఈ పాటను తీర్చిదిద్దారు. డాటర్ సెంటిమెంట్తో రూపొందించిన ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇదని, గోపీచంద్ పాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. కావ్య థాపర్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, సంగీతం: చైతన్ భరద్వాజ్, దర్శకత్వం: శ్రీను వైట్ల.