Mrunal Thakur | ‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఈ భామ తెలుగులో భారీ అవకాశాలతో దూసుకుపోతున్నది. విజయ్ దేవరకొండ, నాని తాజా చిత్రాల్లో నాయికగా ఎంపికైంది. తాజా సమాచారం ప్రకారం తెలుగులో ఈ అమ్మడు మరో పెద్ద సినిమాలో అవకాశాన్ని సొంతం చేసుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. రవితేజ కథానాయకుడిగా గోపీంచద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.
వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న నాలుగో చిత్రమిది కావడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాలో పూజాహెగ్డేను కథానాయికగా ఎంచుకున్నారని వార్తలొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం నాయికగా మృణాల్ ఠాకూర్ పేరును పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది. అయితే ఈ విషయంలో చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉందని అంటున్నారు. పవర్పుల్ మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.