వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘గని’. ఈ చిత్రంలో బాలీవుడ్ తార సయీ మంజ్రేకర్ నాయికగా నటిస్తున్నది. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ కంపెనీ, రెనైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మాతలు. థమన్ సంగీతాన్ని అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను నిర్మాతలు అల్లు బాబీ, సిద్ధు ముద్ద తెలిపారు.
అల్లు బాబీ మాట్లాడుతూ…‘కొన్నేళ్లుగా పరోక్షంగా చిత్రరంగంలోనే ఉన్నాను. జస్ట్ టికెట్ అనే సంస్థను నిర్వహించాను. అలాగే క్యూబ్ అనే కంపెనీకి పనిచేశాను. ‘గని’ చిత్రంతో నిర్మాతగా పరిచయమవుతున్నాను. ఆకట్టుకునే స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని నిర్మించాం. ఇందులో వరుణ్ తేజ్ బాక్సర్ క్యారెక్టర్లో కనిపిస్తారు. మన సొసైటీలో ఇంకా క్రీడల మీద చిన్నచూపు ఉంది. అటు క్రీడారంగంలో రాజకీయాలు బాగా జరుగుతుంటాయి. ఆటలో ఒక క్రీడాకారుడు పేరు తెచ్చుకోవాలంటే ఇటు ఇంట్లో వాళ్లను ఒప్పించి, అటు ఆటలోని రాజకీయాలను ఎదుర్కొని నిలబడాలి. ఆ సమయంలో ఎన్నో ఒడుదొడుకులు వస్తుంటాయి. ఇవన్నీ తట్టుకుని బాక్సింగ్ చాంపియన్ కావాలన్న తన లక్ష్యాన్ని గని ఎలా చేరుకున్నాడు అనేది కథగా ఉంటుంది. సినిమా అంటేనే డ్రామా ఉండాలి. లేకుంటే ప్రేక్షకులకు బయట స్డేడియంలో ఆట చూడటానికి, సినిమాను చూడటానికీ తేడా ఉండదు. వరుణ్ ఈ పాత్రలో నటించేందుకు చాలా కష్టపడ్డారు. ఏప్రిల్ 8న తెలుగుతో పాటు కన్నడలో విడుదల చేస్తున్నాం. ఉపేంద్ర ఉన్నారు కాబట్టి కన్నడలో ఆదరణ బాగుంటుందని ఆశిస్తున్నాం. ఏప్రిల్ 2న విశాఖలో సోదరుడు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.’ అన్నారు.
సిద్ధు ముద్ద మాట్లాడుతూ…‘దర్శకుడు కిరణ్, వరుణ్ తేజ్కు మంచి మిత్రుడు. వరుణ్ ‘తొలిప్రేమ’, ‘అంతరిక్షం’ చిత్రాలకు కిరణ్ పనిచేశాడు. ఈ కథ బాగుందని వరుణ్ చెబితే విని ప్రాజెక్ట్ ప్రారంభించాం. నాలుగేళ్ల కిందట కుదిరిన చిత్రమిది. లాక్డౌన్ వల్ల రెండుసార్లు షూటింగ్ వాయిదా వేసుకున్నాం. బాక్సర్స్ జీవితాల్లో జరిగే కొన్ని ఘటనలు తీసుకుని ఈ కథలో చేర్చాం. గని అనే బాక్సర్ స్పోర్ట్స్ జర్నీ ఇది. ఈ సినిమా ప్రొఫెషనల్ బాక్సింగ్ నేపథ్యంతో నిర్మించాం. మిగతా క్రీడాకారుల జీవితాల్లోలాగే పడి లేవడం, తప్పు తెలుసుకోవడం, విజయాలు సాధించడం అనేది ఇతని జీవితంలోనూ ఉంటాయి. నటీనటులందరినీ ఈ కథ ఉపయోగించుకుంది. భావోద్వేగాలతో సినిమా సాగుతుంటుంది. అన్ని పాత్రల కోణంలో కథను చూస్తారు. ఆ క్యారెక్టర్స్ పూర్తయిన తర్వాతే సినిమా ముగుస్తుంది’ అన్నారు.