గణేష్ బెల్లంకొండ హీరోగా నటిస్తున్న సినిమా ‘స్వాతి ముత్యం’. వర్ష బొల్లమ్మ నాయికగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 5న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘డుం డుం డుం మోగింది మేళం’..అని సాగే లిరికల్ సాంగ్ విడుదల చేశారు.
ఈ పాటను మహతి స్వరసాగర్ స్వరకల్పనలో కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా ఆదిత్య అయ్యంగార్, అరుణ్, లోకేష్ ఆలపించారు. హీరో హీరోయిన్ల వివాహ సందర్భంలో ఈ పాట వస్తుంది. ఈ లిరికల్ సాంగ్ గురించి దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ మాట్లాడుతూ…‘కథానుసారం కథానాయకుడు నాయిక మధ్య వచ్చే పెళ్లి గీతం ఇది. నిశ్చితార్థం నుంచి వివాహం వరకు జరిగే వివిధ కార్యక్రమాల నేపథ్యంగా సాగుతుంది. ఈ సందర్భానికి కృష్ణకాంత్ మంచి సాహిత్యాన్ని అందించారు. అంతే ఆకట్టుకునేలా తెరకెక్కించాం’ అన్నారు.