Balakrishna-Boyapati Combination | టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబోలున్నాయి. ఆ కాంబోలో సినిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రిటీల సైతం ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబోలలో బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ ఒకటి. గత పుష్కర కాలంలో వీరిద్దరూ కలిసి మూడు సినిమాలు చేశారు. ఆ మూడు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు సాధించాయి. అంతేకాకుండా బాలకృష్ణ ఫ్లాపుల్లో ఉన్న ప్రతీసారి బోయపాటితో సినిమా చేసి మళ్ళీ హిట్ ట్రాక్లోకి వచ్చేస్తుంటాడు. గతేడాది వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఓ వైపు కరోనా మహమ్మారి కమ్ముతున్నా.. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి అఖండ చిత్రాన్ని బ్లాక్బస్టర్ చేశారు.
ఇదిలా ఉంటే వీళ్ళ కాంబినేషన్లో నాల్గోవ సినిమా తెరకెక్కుతున్నట్లు గత కొంత కాలం నుండి వార్తలు వస్తున్నాయి. రానున్న ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని బాలయ్య, బోయపాటితో ఓ పొలిటికల్ సినిమా తీయాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం బోయపాటి స్క్రిప్ట్ను సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వీరిద్దరూ కలిసి నాలుగో సినిమా చేయనుండటంతో నిర్మాతలు కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగం అవ్వాలని తీవ్ర ఆసక్తి చూపుతున్నారట. ఈ క్రమంలోనే ఈ సినిమాను నిర్మించేందుకు నాలుగు నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయట.
సితార ఎంటర్టైనమెంట్స్, ద్వారక క్రియేషన్స్, 14రీల్స్ ప్లస్, శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలు ఈ సినిమా కోసం పోటీ పడుతున్నాయట. బడ్జెట్ ఎంతైనా సరే పెట్టడానికి ఆ నాలుగు నిర్మాణ సంస్థలు రెడీగా ఉన్నాయట. ఎందుకంటే వీళ్ళ కాంబోలో వచ్చిన మూడు సినిమాలు బడ్జెట్కు రెట్టింపు కలెక్షన్లు సాధించాయి. ఇక ఇప్పుడు నాలుగో సినిమా.. పైగా పొలిటికల్ కథ కానుండటంతో జస్ట్ హిట్ టాక్ వచ్చిన సరే కలెక్షన్ల వర్షం కురుస్తుంది. అంతేనా.. డిజిటల్, శాటిలైట్ హక్కులు సైతం కోట్లలో ధర పలుకుతాయి. దాంతో ఎటు చూసిన నిర్మాతలకు లాభాలే వస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని టాలీవుడ్ నిర్మాతలు ఈ సినిమా కోసం పోటీ పడుతున్నారు. మరీ ఆ అదృష్టం ఏ నిర్మాతకు దక్కుతుందో చూడాలి.