పవన్కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాకోసం ఆయన అభిమానులే కాదు, అందరు హీరోల అభిమానులూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు భాగాలుగా దర్శకుడు జ్యోతికృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలి పార్ట్ షూట్ దాదాపు పూర్తి కావచ్చింది. పవన్కల్యాణ్పై నాలుగు రోజుల షూట్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. అయితే.. ఆ నాలుగు రోజులకే ఆయన ఇన్నాళ్లూ టైమ్ కేటాయించలేకపోయారు. అయితే.. ఎట్టకేలకు పవన్కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సెట్లోకి ఆదివారం ఎంట్రీ ఇచ్చారని తెలుస్తున్నది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ షూట్తో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందట. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసి త్వరలోనే సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.
చారిత్రక పాత్రలతో కూడిన ఫిక్షన్ కథతో ఈ సినిమా రూపొందుతోంది. గోల్కొండ నవాబు కులీ కుతుబ్షా, మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి ఔరంగజేబు పాత్రలు కథలో కీలకం కానున్నాయట. ఇందులో పవన్కల్యాణ్ రాబిన్హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారట. ఈ సినిమా కథ కోహినూర్ వజ్రం చుట్టూ తిరుగుతుందని సమాచారం. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహీ, సునీల్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కెమెరా: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్, నిర్మాత: ఏ.దయాకర్రావు, సమర్పణ: ఏ.ఎం.రత్నం, నిర్మాణం: మెగా సూర్య ప్రొడక్షన్స్.