కోవిడ్ మహమ్మారి అనంతరం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిణామాలు, వ్యాక్సిన్స్ కోసం జరిగిన ప్రయత్నాల నేపథ్యంలో దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ‘ది వ్యాక్సిన్ వార్’ పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఐయామ్ బుద్ధ ప్రొడక్షన్ పతాకంపై పల్లవి జోషి నిర్మిస్తున్నారు. పదకొండు భారతీయ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా గురువారం పోస్టర్ను విడుదల చేశారు. దీనిపై ‘మీకు తెలియని యుద్ధంలో మీరు పోరాడి గెలిచారు’ అనే సందేశం కనిపిస్తున్నది. నిర్మాత మాట్లాడుతూ ‘కరోనా అనంతరం వ్యాక్సిన్ రూపకల్పనలో మన శాస్త్రవేత్తల అసమాన కృషిని, త్యాగాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించబోతున్నాం. వారికి అంకితభావానికి నివాళిగా ఈ సినిమా ఉంటుంది’ అన్నారు.