కొచ్చి: మలయాళ సినీ దర్శకుడు బైజు పరవూర్ (42) అకాల మరణం చెందాడు. మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన కేరళలోని కొచ్చి సిటీలోగల ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. అయితే ఫుడ్ పాయిజన్ కారణంగానే ఆయన మరణించి ఉంటారని బైజు పరవూర్ కుటుంబసభ్యులు, బంధువులు భావిస్తున్నారు.
బైజు పరవూర్ గత శనివారం కోజికోడ్లోని ఓ హోటల్ భోజనం చేశాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన ఆయన అస్వస్థతకు గురయ్యాడు. దాంతో కుటుంబసభ్యులు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మెడికేషన్ ఇచ్చి పంపారు. కానీ ఆదివారం ఉదయంకల్లా పరిస్థితి విషమించింది. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు కొచ్చి ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం బైజు పరవూర్ ప్రాణాలు కోల్పోయాడు. దాంతో ఫుడ్ పాయిజనే బైజు పరవూర్ మరణానికి కారణమని ఆయన కుటుంబసభ్యులు భావిస్తున్నారు. కాగా, బైజు పరవూర్ ఇప్పటివరకు 45 చిత్రాలకు దర్శకుడిగా పనిచేసినట్లు సమాచారం.