Mahatma Jyotirao Phule | బాలీవుడ్ నుంచి వస్తున్న ‘ఫూలే’ సినిమాపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ 11న విడుదల కావాల్సి ఉండగా.. బ్రాహ్మణ సమాజంలోని కొందరు వ్యక్తులు ఈ సినిమాలో తమ సమాజాన్ని తప్పుగా చూపిస్తున్నారని ఆరోపించడంతో సీబీఎఫ్సీ పలు సవరణలు చేయాలని ఆదేశించింది. ‘మాంగ్’, ‘మహర్’, ‘పేష్వాయి’ వంటి పదాలను తొలగించాలని, ‘3000 సంవత్సరాల గులామీ’ అనే డైలాగ్ను ‘కొన్ని సంవత్సరాల గులామీ’గా మార్చాలని ఆదేశించింది. అయితే దీనికి దర్శకుడు అంగీకరించకపోవడంతో ఈ సినిమా విడుదలను ఆపాలని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సెన్సార్ బోర్డు కూడా సినిమా విడుదల కావాలంటే కుల సంబంధిత పదాలను తొలగించాలని చెప్పింది. దీంతో ఈ వివాదం ప్రస్తుతం నడుస్తునే ఉంది. అయితే ఈ వివాదం తాజాగా బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందిస్తూ.. సెన్సార్ బోర్డ్పై నిప్పులు చెరిగాడు.
అనురాగ్ కశ్యప్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలలో ఈ మూవీ వివాదంపై స్పందిస్తూ.. నా జీవితంలో మొదటి నాటకం మహాత్మా జ్యోతి రావు ఫూలే, సావిత్రి బాయి ఫూలేలపైనే చేశాను. ఈ దేశంలో కులవాదం లేకపోతే వారిద్దరూ ఎందుకు పోరాడాల్సి వచ్చింది? ఇప్పుడున్న బ్రాహ్మణులు సిగ్గుపడుతున్నారా లేదా సిగ్గుతో చచ్చిపోతున్నారా లేదా మనం చూడలేని వేరే బ్రాహ్మణుడు భారతదేశంలో నివసిస్తున్నాడా దయచేసి ఎవరైనా వివరించండి – ఇక్కడ నిజమైన మూర్ఖుడు ఎవరని పోస్ట్ పెట్టాడు.
మరో పోస్ట్లో, అనురాగ్ కశ్యప్ సెన్సార్ బోర్డ్ను మోసపూరిత వ్యవస్థగా అభివర్ణించారు. ఒక సినిమా సెన్సార్కు వెళ్లినప్పుడు బోర్డులో నలుగురు సభ్యులు ఉంటారు. ఈ సినిమాను సెన్సార్ చూసిన అనంతరం అందులో ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయని బయటివారికి ఎలా తెలుస్తుంది. బయటివారు ఈ సినిమాను అడ్డుకోవాలని ఎలా చెబుతున్నారు. ఇది సెన్సార్లోని సభ్యులు అనుమతిస్తేనే ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ మొత్తం వ్యవస్థ పూర్తిగా మోసపూరితమైనదిగా మారిందని తెలిపారు. కులవాదంని బయటపెట్టే సినిమాలను ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. వారు (ప్రభుత్వం) దేని గురించి బాధపడుతుందో బహిరంగంగా చెప్పడానికి కూడా సిగ్గుపడుతుంది. పిరికివాళ్ళు అని విమర్శించారు.
మరో పోస్ట్లో సీబీఎఫ్సీని తీవ్రంగా విమర్శిస్తూ ధడక్ 2 సినిమా సమయంలో, మోడీ భారతదేశంలో కుల వ్యవస్థను నిర్మూలించారని సెన్సార్ బోర్డు మాకు చెప్పింది. కానీ అదే కారణంతో, ‘సంతోష్ ‘ సినిమా కూడా భారతదేశంలో విడుదల కాలేదు. ఇప్పుడు, బ్రాహ్మణులు ‘ఫూలే ‘ సినిమాను వ్యతిరేకిస్తున్నారు. సోదరులారా, కుల వ్యవస్థ లేకపోతే, మీరు బ్రాహ్మణులు ఎలా అవుతారు? మీరు ఎవరు? ఎందుకు అంతగా దిగులుపడుతున్నారు? కుల వ్యవస్థ లేకపోతే, జ్యోతిబా ఫూలే, సావిత్రి బాయి వంటి వాళ్లు ఎందురు పోరాడరు.? మోడీ చెప్పినట్లు భారతదేశంలో కుల వ్యవస్థ లేకపోతే మీ బ్రాహ్మణత్వం ఉనికిలో లేదా, లేదా అందరూ మోసపోతున్నారా? కులతత్వం భారతదేశంలో ఉందో లేదో ఒకసారి తేల్చుకోండి. ప్రజలు మూర్ఖులు కాదు. మీరు బ్రాహ్మణులా లేదా పెత్తనం చేసేవాళ్ళు బ్రాహ్మణులా? ఇప్పుడే నిర్ణయించండి అనురాగ్ రాసుకోచ్చారు.
ఫూలే (Phule) సినిమా విషయానికి వస్తే.. ఫూలే పాత్రలో గుజరాతీ నటుడు ప్రతీక్ గాంధీ నటిస్తున్నాడు. అతడి భార్య సావిత్రి బాయి ఫూలే పాత్రలో బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు భార్య పత్రలేఖ నటిస్తుంది. అనంత్ నారాయణ్ మహాదేవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. జీ స్టూడియోస్ బ్యానర్పై ప్రణయ్ చోక్షి, జగదీష్ పటేల్, రితేష్ కుదేచా, అనుయా చౌహాన్ కుదేచా, సునీల్ జైన్ తదితరులు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.