‘మరో జన్మంటూ ఉంటే దర్శకుడిగా పుట్టను’ అని ఆ మధ్య నేను అనడానికి కారణం ట్రోలింగ్ కానేకాదు. ఓ దర్శకుడికి ఉండే ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొనే అప్పుడలా మాట్లాడా. డైరెక్టర్ సీట్లో కూర్చున్న ఎవరికైనా ఒత్తిడి తప్పదు. ప్రపంచంలో తృప్తి లేని బాధ్యత డైరెక్షన్ మాత్రమే. ఈ కారణంగా కంటికి నిద్ర ఉండదు. 1992లో ‘లాఠీ’ సినిమాతో దర్శకుడ్నయ్యాను. అప్పట్నుంచే నిద్రకు దూరమయ్యా. వచ్చే జన్మలోనైనా హాయిగా నిద్రపోవాలనుంది. అందుకే ‘డైరెక్టర్గా పుట్టను’ అన్నాను.’ అంటూ వివరణ ఇచ్చారు దర్శకుడు గుణశేఖర్. ఆయన దర్శకత్వంలో రూపొందిన యువతరం సినిమా ‘యుఫోరియా’. భూమిక ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి కీలక పాత్రధారులు. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం(నేడు) విడుదల కానున్నది.
ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుణశేఖర్ ఇంకా మాట్లాడుతూ ‘ఇది నా 14వ సినిమా. తొలి సినిమా చేస్తున్నప్పుడు ఎలా ఫీలయ్యానో ఇప్పుడు కూడా అదే ఫీల్తో ఉన్నా. ఈ కొత్త కథను మరింత కొత్తగా చెప్పేందుకు ప్రయత్నించా. ప్రేక్షకుల డబ్బును, సమయాన్ని వృధా చేయకుండా, వారి విజ్ఞతకు పెద్ద పీట వేస్తూ ఈ సినిమా తీశా. చూసినవారంతా అభినందించారు. ఫ్యామిలీ ప్రొడక్ట్లా తీశారని మెచ్చుకున్నారు. ఈ కథకు సారా అర్జున్ ఆత్మ. భూమిక బ్యాక్ బోన్. వింధ్య వేములపల్లి పాత్రలో ఆమె జీవించింది. విఘ్నేష్ ఈ సినిమాకు బ్రెయిన్ లాంటివాడు. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ సినిమా రూపొందింది. నా మేధస్సుని ఉపయోగించి కాకుండా, సమాజాన్ని చూసిన సాధారణ మనిషిగా ఈ మూవీ తీశాను. సమాజంలో జరిగిన కొన్ని సంఘటలను తీసుకొని రాసుకున్న కథ ఇది.’ అని తెలిపారు. రీసెంట్గా ఈ మూవీ చూశానని, రాత్రంతా నిద్రపోలేదని, ఈ సినిమా వెంటాడుతూనే ఉందని నటి భూమిక చెప్పారు. ఇంకా నిర్మాత నీలిమ గుణ, నటి లిఖిత, నటులు విఘ్నేష్, పృథ్వీరాజ్ కూడా మాట్లాడారు.