రవీంద్రభారతి, మార్చి28 : ప్రపంచం, దేశం గర్వించ దగ్గ గొప్ప సినీగేయ రచయిత చంద్రబోస్ అని, 75 సంవత్సరాల తరువాత దేశానికి, తెలుగు నేలకు ‘నాటు నాటు’ పాటకు అస్కార్ అవార్డు రావడం ఎంతో గర్వకారణమని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ. శ్రీనివాస్గౌడ్ అన్నారు. ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ అస్కార్ అవార్డు అందుకున్న సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరిగౌరీశంకర్ అధ్యక్షతన రవీంద్రభారతిలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి వి. శ్రీనివాస్గౌడ్ విచ్చేసి చంద్రబోస్ను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మంత్రి వి. శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ 95 సంవత్సరాల తర్వాత భారత దేశానికి మొట్టమొదటి సారిగా తెలుగు పాట ‘నాటు నాటు’కు అస్కార్ అవార్డు రావడం జరిగిందన్నారు. ఒకనాడు తెలంగాణలో కవులే లేరని అవహేళన చేశారని, ఆనాడే సురవరం ప్రతాప్రెడ్డి కవులను ప్రపంచానికి పరిచయం
చేశారని తెలిపారు. విశ్వశిఖరంపై తెలంగాణ కవులు సత్తాచాటారన్నారు.
ముఖ్యంగా చంద్రబోస్ తెలంగాణ రాష్ట్రం ఓరుగల్లు ప్రాంతానికి చెందిన ముద్దుబిడ్డని అలాంటి గొప్ప రచయితకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులన్నారు. నాటి
ఉద్యమ సారథి, ముఖ్యమంత్రి కేసీఆర్గారు తెలంగాణ కవులు, కళాకారులతో మమేకమై తెలంగాణ ఉద్యమానికి నాందిపలికారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళి అందరి సమక్షంలో చంద్రబోస్కు గొప్పగా సన్మానం చేయడానికి సన్నాహాలు చేస్తామన్నారు. అనంతరం ప్రముఖ సినీనటుడు ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ అస్కార్ అందుకోవడం చిన్న విషయం కాదని, ప్రపంచ తెలుగు జాతి గర్వించదగ్గ విషయమన్నారు. అస్కార్ హాలీవుడ్కి మాత్రమే పరిమితమైందని, కానీ చంద్రబోస్ చరిత్రను తిరగరాశారని కొనియాడారు. అనంతరం చంద్రబోస్ మాట్లాడుతూ సినిమా కవులు పాటలు రాసినా, రాయకపోయినా అణకువగా ఉండాలన్నారు. పాటలు రాయడానికి తాను ఎక్కువ సమయం తీసుకోనని, కానీ ‘నాటు నాటు’ పాటకు సంగీత దర్శకుడు కీరవాణితో కలిసి సంవత్సరం పాటు కష్టపడినట్లు తెలిపారు. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం ఆనందంగా ఉందన్నారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరిగౌరీశంకర్ మాట్లాడుతూ ప్రపంచం గర్వించ దగ్గ పాటల రచయిత చంద్రబోస్కు ఆస్కార్ అవార్డు రావడంతో తెలంగాణకు, తెలుగు వారికి ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. చంద్రబోస్ రాబోయే కాలంల మరిన్ని మంచి పాటలను రాయాలని ఆయన ఆకాక్షించారు. తెలంగాణ మట్టిని పట్టుకున్నా కవిత్వమే వస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర ఎంతో కీలమైందని ఆయన పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో చంద్రబోస్ తండ్రి నర్సయ్య, తెలంగాణ గ్రంథాలయ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, రాపోలు సుదర్శన్, రవీంద్రచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి పాల్గొన్నారు.
చంద్రబోస్కు ఆస్కార్ రావడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికి జరిగే సన్మానంగా నేను భావిస్తున్నాను. ఒక తెలుగు పాటకు ఇంత ఘనకీర్తి రావడం ఎంతో అభినందనీయమన్నారు. తెలుగు సాహిత్యాన్ని ప్రపంచానికి తెలియజేసిన గొప్ప సినీ గేయ రచయిత చంద్రబోస్ అన్నారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చంద్రబోస్కు మరింత చేయూతనివ్వాలని, ఆయన భవిష్యత్లో మరిన్ని మంచి పాటలు రాసి గొప్ప అవార్డులను పొందాలని ఆకాంక్షించారు.