“ఎందరో గొప్ప కవులకూ, కళాకారులకూ జన్మనిచ్చిన స్థలం ఈ కరీంనగర్. పవిత్ర గోదావరి పారే పుణ్యతీర్థం ఈ కరీంనగర్. ఇంతటి పవిత్ర స్థానంలో ఈ వేడుక జరగడం ఆనందంగా ఉంది. సినిమా బాగా తీశాను. మంచి సినిమా తీసి మీ ముందుకొచ్చాను. అందుకే టెన్షన్ లేదు. మీరు ఆదరిస్తారని నా నమ్మకం” అన్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన దర్శకత్వంలో రామ్ పోతినేని, శ్రీలీల జంటగా రూపొందిన చిత్రం ‘స్కంద’. శ్రీనివాస్ చిట్టూరి, పవన్కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం కరీంనగర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో రామ్ మాట్లాడుతూ -“ ‘స్కంద’ మాస్ సినిమా మాత్రమే కాదు. చక్కని కుటుంబకథాచిత్రం కూడా. ఇందులోని భావోద్వేగాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. బోయపాటి గత సినిమాల్లా మంచి మెసేజ్ కూడా ఇందులో ఉంటుంది” అని చెప్పారు.
“బోయపాటి దర్శకత్వంలో సరైనోడు, అఖండ సినిమాల్లో నటించాను. ఇది ఆయనతో నేను చేసిన మూడో సినిమా. కచ్చితంగా ఈ సినిమా కూడా హిట్.. నో డౌట్. బోయపాటితో ఇది నా హ్యాట్రిక్ హిట్ అవుతుంది. ‘ఇస్మార్ట్ శంకర్’లో రామ్ ఎనర్జీని చూసినప్పుడు షాకయ్యాను. ఇంతకంటే చేయటానికేముంది? అనిపించింది. ఈ సినిమాలో అంతకు మించిన ఎనర్జీని చూపించాడు రామ్. ఈ సినిమా భారీ విజయం పక్కా.” అని శ్రీకాంత్ నమ్మకంగా చెప్పారు. ఇంకా సయీ మంజ్రేకర్, ఇంద్రజ, ప్రిన్స్, దగ్గుబాటి రాజా, సినిమాటోగ్రాఫర్ సంతోశ్ డేటాకే, శ్రవణ్, రచ్చ రవి, చిట్టి, నెక్కంటి శ్రీధర్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.