కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్, విజయ్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఇద్దరి సినిమాలకు తమిళనాడులోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్, మార్కెట్ ఉంటుంది. విజయ్ నటిస్తున్న (Varisu) వారిసు (తెలుగులో వారసుడు), అజిత్ నటించిన తునివు (Thunivu) సంక్రాంతి కానుకగా తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేయబడ్డ థియేటర్లలో సందడి చేస్తున్నాయి.
మరోవైపు ఈ రెండు చిత్రాలు తమిళనాడులో పొంగల్ కానుకగా బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు జనవరి 12న బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి. అయితే ఈ స్టార్ హీరోల సినిమాలకు మంచి డిమాండ్ ఉండటంతో తమిళనాడు ఫిలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పెషల్ షోలు వేయించుకునేందుకు అనుమతివ్వాలని కోరింది. తమిళనాడులో సాధారణంగా స్పెషల్ షోలు వేసుకునే ఆస్కారం ఉండదు.
కానీ పొంగల్కు వారిసు, తునివు ఒకే రోజున విడుదలవుతున్న నేపథ్యంలో ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కోరినట్టు కోలీవుడ్ సర్కిల్ టాక్..కాగా మరి ప్రభుత్వం ఎగ్జిబిటర్ల విజ్ఞప్తిని పరిశీలిస్తుందా..? లేదా..? అన్నది తెలియాల్సి ఉంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న వారసుడు చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ప్రకాశ్ రాజ్, ప్రభు, శ్రీకాంత్, యోగిబాబు, శరత్ కుమార్, జయసుధ, ఖుష్బూ సుందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హెచ్ వినోథ్ డైరెక్షన్లో చేస్తున్న తునివు..నో గట్స్ నో గ్లోరీ ట్యాగ్లైన్తో వస్తుంది. ఈ చిత్రంలో మలయాళ భామ మంజు వారియర్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. తునివు చిత్రంలో సంజయ్ దత్, సముద్రఖని, మహానంది శంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.