‘ఎఫ్3’ చిత్రంలో ‘ఎఫ్2’ను మించిన వినోదం ఉంటుందని చెబుతున్నారు ఎడిటర్ తమ్మిరాజు. ఈ సిరీస్లో సినిమాలు కొనసాగుతాయని ఆయన చెప్పారు. వెంకటేష్, వరుణ్తేజ్, తమన్నా, మెహరీన్, సోనాల్చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఎడిటర్ తమ్మిరాజు మాట్లాడుతూ…నేను చిత్ర పరిశ్రమకు వచ్చి 20 ఏళ్లవుతున్నది. దాదాపు 30 చిత్రాలకు ఎడిటింగ్ చేశాను. ‘పటాస్’, ‘బాహుబలి 2, ‘ఎఫ్2’ లాంటి సినిమాలు అందులో ఉన్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడితో పటాస్ చిత్రానికి పనిచేశాను. ఆ తర్వాత ‘ఎఫ్2’కు ఎడిటింగ్ బాధ్యతలు వహించాను. గత సినిమా చేసిన అనుభవంతో చెబుతున్నా…‘ఎఫ్3’లో మొదటి సినిమాకు రెట్టింపు వినోదాన్ని చూస్తారు.
డబ్బు మన జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనేది ఈ చిత్రంలో హాస్యభరితంగా తెరకెక్కించారు. ‘ఎఫ్2’లోని పాత్రలను తీసుకుని కొత్త కథతో దర్శకుడు అనిల్ ఈ సినిమాను రూపొందించారు. ఆ కథ ముగిసిన చోటు నుంచి ఈ కథ మొదలవదు. మంచి రచనతో పాటు సరైన ఎడిటింగ్ సినిమా విజయాన్ని నిర్ణయిస్తుందని నమ్ముతాను. క్రిస్ప్ రన్ టైమ్తో ఈ సినిమా ఉంటుంది. కథ వింటే ఏం తెరకెక్కిస్తారో తెలుస్తుంది కాబట్టి కథ వినను, మొత్తం సినిమా ఎడిటింగ్ టేబుల్ మీదే చూస్తాను. అప్పుడు కొత్త కోణంలో సినిమాను చూడగలుగుతాను. నిర్మాత దిల్ రాజుకు సినిమా పట్ల మంచి అభిరుచి ఉంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ‘బింబిసార’, చిరంజీవి, బాబీ సినిమా, నాగ శౌర్య ‘కృష్ణ వ్రింద విహారీ’ చిత్రాలకు ఎడిటింగ్ చేస్తున్నాను అన్నారు.