D.V.V Danayya | సినీరంగంలో పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలు వాళ్ళ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటారు. ఇప్పటికే అలా పలువురు సినీప్రముఖుల వారసులు సినీరంగంలో పరిచయమై స్టార్ హీరోలుగా ఎదిగారు. ఈ క్రమంలో మరో స్టార్ ప్రోడ్యూసర్ కొడుకు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నాడు. ఆ స్టార్ ప్రొడ్యూసర్ మరెవరో కాదు డివివి దానయ్య. ఈయన తన కొడుకు కళ్యాణ్ను హీరోగా లాంఛ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడట.
గతంలో ‘లక్ష్యం’, ‘లౌక్యం’ ఫేం శ్రీవాస్ దర్శకత్వంలో దానయ్య తన కొడుకును లాంఛ్ చేయనున్నట్లుగా వార్తలు వచ్చాయి. దానికోసం శ్రీవాస్ కూడా ఓ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ కథను సిద్ధం చేశాడట. కానీ కొన్ని కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. తాజాగా దానయ్య తన కొడుకు లాంఛింగ్ను ఓ యువ దర్శకుడికి అప్పగించినట్లు తెలుస్తుంది. అ!, కల్కి, జాంబిరెడ్డి వంటి వినూత్న మైన సినిమాలను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ కళ్యాణ్ డెబ్యూ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడట. ప్రస్తుతం ఈయన తేజ సజ్జాతో ‘హను-మాన్’ అనే సూపర్ హీరో ఫిలింను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం అనంతరం ప్రశాంత్ వర్మ కళ్యాణ్తో సినిమా పట్టాలెక్కనుంది.
ప్రశాంత్ వర్మ కళ్యాణ్ కోసం ఇప్పటికే ఓ వినూత్న కథను సిద్ధం చేశాడట. ఈ చిత్రాన్ని మొత్తం యంగ్ టెక్నీషియన్స్తో తెరకెక్కించాలని దానయ్య ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే కళ్యాణ్ నటన, ఫైట్స్, డ్యాన్స్ వంటి వాటిలో శిక్షణ తీసుకున్నాడట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన రానుంది. లేటెస్ట్గా ఈయన నిర్మించిన ట్రిపుల్ఆర్ మార్చి 25న విడుదల కానుంది. ఈ క్రమంలో దానయ్య ‘ట్రిపుల్ ఆర్’ ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్రం అనంతరం తన కొడుకు లాంఛింగ్పై పూర్తి దృష్టి పెట్టనున్నాడు.