శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నారాయణ్దాస్ నారంగ్, పి.రామ్మోహన్రావు నిర్మిస్తున్న ‘లవ్స్టోరి’ చిత్రాన్ని వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 10న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అదే రోజు అమెజాన్ ప్రైమ్లో నాని హీరోగా నటించిన ‘టక్జగదీష్’ విడుదలకానుంది. ‘లవ్స్టోరి’కి పోటీగా ఓటీటీలో ‘టక్ జగదీష్’ విడుదలచేయడం పట్ల తెలంగాణ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ శుక్రవారం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ సునీల్ నారంగ్ మాట్లాడుతూ “లవ్స్టోరి’ చిత్రానికి పోటీగా సెప్టెంబర్ 10న ఓటీటీలో ‘టక్ జగదీష్’ సినిమా విడుదలచేయబోతున్నట్లు తెలిసింది. చిత్ర నిర్మాతకు మేము ఫోన్ చేస్తే ఆర్థిక సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందన్నారు. మా సినిమా విడుదల తేదీని ప్రకటించిన తర్వాత పోటీగా అదే రోజు తమ సినిమాను ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సరైంది కాదు. ఇలాంటి చర్యల వల్ల నిర్మాతలు నష్టపోతారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి వస్తుంది. పండుగల సమయంలో ఓటీటీలలో సినిమాల్ని విడుదల చేయొద్దు. అక్టోబర్ 31 వరకు ఓటీటీలలో పెద్ద సినిమాల్ని విడుదల చేయద్దని నిర్మాతల్ని కోరినా మాకు సహకరించకపోవడం బాధాకరం’ అని అన్నారు. విజయేందర్రెడ్డి మాట్లాడుతూ ‘సెకండ్వేవ్ తర్వాత థియేటర్లలో సినిమాలు విడుదలవుతున్నా సరైన వసూళ్లు రావడం లేదు. పెద్ద సినిమాతో మాకు పూర్వ వైభవం వస్తుందనే తరుణంలో మా సంతోషాన్ని హరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పోటీతత్వం వల్ల థియేటర్లు మొత్తం మూతపడతాయి’ అన్నారు. థియేటర్లలో సినిమా చూడాలంటూ ప్రచార వేడుకల్లో చెప్పిన హీరో నాని తన మాటను మార్చుకొని ఎక్కువ డబ్బులు తీసుకొని ఓటీటీలో తన సినిమాను విడుదలచేస్తున్నారని శ్రీహరి పేర్కొన్నారు. డబ్బు తాత్కాలికం కానీ థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్టిబిటర్ల వ్యవస్థ మాత్రం శాశ్వతంగా ఉంటుందని, ఓటీటీలలో నిర్మాతలు తమ సినిమాల్ని విడుదల చేసే ముందు పంపిణీదారులు, ఎగ్జిబిటర్లను సంప్రదిస్తే బాగుంటుందని నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు పేర్కొన్నారు.