తెలుగు చిత్రసీమలో భారీ హంగులతో రూపుదిద్దుకునే సకుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరుగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థను అభివర్ణిస్తారు. ఈ బ్యానర్పై జనరంజకమైన చిత్రాల్ని తెరకెక్కిస్తూ అభిరుచిగల నిర్మాతగా గుర్తింపును సంపాదించుకున్నారు సూర్యదేవర నాగవంశీ. ఆయన తొలిసారి తన పంథాకు భిన్నంగా రూపొందించిన న్యూఏజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘డీజే టిల్లు’. సిద్ధూ జొన్నలగడ్డ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి విమల్కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా అగ్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ గురువారం పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
యువత లక్ష్యంగా..
కరోనా లాక్డౌన్ సమయంలో ఈ కథ విన్నా. క్రైమ్ కామెడీ నేపథ్యంలో చాలా కొత్తగా అనిపించింది. మా సంస్థ ఇప్పటివరకు ఈ తరహా సినిమా చేయలేదు. కరోనా ప్రభావంతో కొంతకాలంగా ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు రావడం లేదు. ఇలాంటి సమయంలో యువతను ఆకట్టుకునే ఈ తరహా సినిమాతో ముందుకొస్తే బాగుంటుందని భావించాం. నేటి యువత జీవన విధానాన్ని ఆవిష్కరిస్తూ చివరలో గొప్ప సందేశంతో హృద్యమైన కథగా అనిపిస్తుంది. హీరో సిద్ధూ జొన్నలగడ్డ ఇందులో అమాయకుడైన హైదరాబాద్ యువకుడిగా కనిపిస్తాడు.
సీక్వెల్ ఉంటుంది..
ఈ సినిమాలో బోల్డ్కంటెంట్ ఏమీ ఉండదు. కొన్ని ముద్దు దృశ్యాలుంటాయి. ప్రేమ వ్యక్తీకరణలో భాగంగా ముద్దుసీన్స్ చూపించడం ఈ రోజుల్లో సాధారణ విషయంగానే చూడాలి. ఈ సినిమా మూలకథలో చాలా మార్పులు చేశాం. త్రివిక్రమ్గారి సలహాలు తీసుకున్నాం. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్గా నిలుస్తుంది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందనే హింట్తో పతాకఘట్టాలను తీర్చిదిద్దాం. తప్పకుండా సీక్వెల్ను తెరకెక్కించాలనుకుంటున్నాం. ఇటీవలకాలంలో మా సంస్థ కొత్త వాళ్లతో కూడా కలిసి పనిచేస్తున్నది. నూతన ఆలోచనలతో ముందుకొచ్చే వారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో చిన్న సినిమాల్ని కూడా తీస్తున్నాం.
‘భీమ్లానాయక్’ విడుదల అప్పుడే..
‘భీమ్లానాయక్’ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. బ్యాలెన్స్గా ఉన్న పాట చిత్రీకరణను గురువారం నుంచి మొదలుపెట్టాం. ఏపీలో కరోనా నిబంధనలను సడలించి, నైట్ కర్ఫ్యూ ఎత్తివేస్తే ముందుగా ప్రకటించినట్లుగానే ఈ నెల 25న సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం. లేకపోతే భవిష్యత్తు పరిస్థితులను బట్టి రిలీజ్ విషయంలో నిర్ణయం తీసుకుంటాం.