‘రెండు దశాబ్దాల నుంచి విద్యా వ్యవస్థలోని లొసుగులు అలాగే ఉన్నాయి. పరీక్షలు, ర్యాంకులు అంటూ విద్యార్థులు ఆ రోజుల్లో కూడా ఒత్తిడికి గురయ్యేవారు. చదువు ఓ నిత్యావసరం. అందుకే 90దశకం నేపథ్యంలో రూపొందించిన ‘సార్’ కాన్సెప్ట్..ఇప్పటి తరానికి కూడా కనెక్ట్ అవుతున్నది’ అన్నారు వెంకీ అట్లూరి. ఆయన దర్శకత్వంలో ధనుష్ కథానాయకుడిగా సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ‘సార్’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శనివారం దర్శకుడు వెంకీ అట్లూరి పాత్రికేయులతో ముచ్చటిస్తూ పంచుకున్న విశేషాలు..
లాక్డౌన్ సమయంలో ఓటీటీలో ధనుష్ సినిమాలు చాలా చూశాను. ఆయన నటన పట్ల ఇష్టం పెరిగింది. దాంతో ఆయనతోనే ఈ సినిమా చేయాలనుకున్నా. కథ వినగానే ధనుష్ చప్పట్లతో సంతోషం వ్యక్తం చేసి డేట్స్ ఎప్పుడు కావాలని అడిగారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే కథ ఇది. ఈ సినిమా చూశాక పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది. ఈ సినిమా నిర్మాణంలో అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ భాగస్వామి కాబట్టి ఓ నిర్మాతగా నాతో అనేక విషయాలు చర్చించారు. ఈ సినిమాలో తండ్రీకొడుకుల మధ్య వచ్చే ఓ భావోద్వేగభరిత సన్నివేశం త్రివిక్రమ్తో జరిపిన సంభాషణ నుంచే పుట్టింది.
వాటిలో పోల్చవద్దు
త్రీ ఇడియట్స్, సూపర్ 30 సినిమా కథలతో మా చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. ‘సూపర్ 30’ ఓ బయోపిక్. ‘సార్’ పూర్తిగా ఫిక్షనల్ కథ. దర్శకుడిగా తొలి మూడు చిత్రాల్ని ప్రేమకథలతో తీశాను. కొత్త పంథాలో వెళ్దామనుకొని సోషల్ పాయింట్ను ఎంచుకున్నా. నా ఎడ్యుకేషన్ మొత్తం 90 దశకంలో సాగింది. నేను చూసిన యథార్థ సంఘటనలు, ఎదుర్కొన్న అనుభవాలతో కథ రాసుకున్నా. ఇది యూనివర్సల్ కథాంశం కాబట్టి హిందీలో కూడా రిలీజ్ చేయమని అడుగుతున్నారు. నా తదుపరి చిత్రం గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నా. ఇక నుంచి కథాంశాల పరంగా ప్రతి సినిమాలో వైవిధ్యం చూపించే ప్రయత్నం చేస్తా.