Director Teja | ట్రెండ్ మారింది.. సినిమాల మేకింగ్ మారిపోయింది.. ఓ సినిమాను ప్రేక్షకులు చూసే విధానం కూడా పూర్తిగా మారిపోయింది.. ఒకప్పట్లా రెగ్యులర్ మూస మసాలా చేస్తే మొహం మీద తిప్పి కొడుతున్నారు ప్రేక్షకులు. అరచేతిలో ఓటీటీ ఉన్నప్పుడు.. అద్భుతమైన కంటెంట్ ఉంటే తప్ప థియేటర్స్ వరకు జనాలు రావడం లేదు. ఇలాంటి సమయంలో పాత చింతకాయ పచ్చడి కథలు తీస్తే ఒక్కరోజు కూడా థియేటర్లో ఉంచే ప్రసక్తే లేదంటూ తెగేసి చెప్తున్నారు ఆడియన్స్. అందుకే దర్శకులు కూడా కొత్తగా ఆలోచిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో కూడా కొందరు దర్శకులు తాము 20 సంవత్సరాల కింద ఎలాంటి సినిమాలు తీశామో.. మళ్ళీ అలాంటి కథలు ఇప్పుడు ప్రేక్షకులకు చూపించాలని ప్రయత్నిస్తున్నారు.
అందులో అందరికంటే ముందు వరుసలో వచ్చే Director Teja మిలీనియం మొదట్లో చిత్రం అంటూ ఒక పదేళ్లు ముందే అద్భుతమైన సినిమా తీశాడు తేజ. అప్పటికి ఉన్న ట్రెండుకు అది చాలా కొత్త సబ్జెక్ట్. ఈ దర్శకుడు ఎవరో పదేళ్లు అడ్వాన్స్ ఆలోచించాడు.. ఫ్యూచర్లో ఇంతకంటే అద్భుతమైన సినిమాలు చేస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన అంతవరకే ఆలోచిస్తాడని ఆ తర్వాత అర్థమైంది. ఎందుకంటే చిత్రం తర్వాత జయం, నువ్వు నేను బ్లాక్ బస్టర్ కావడంతో తేజ రేంజ్ పెరిగింది. కానీ ఆయన ఆలోచన తీరు మాత్రం మారలేదు.
ఆ తర్వాత కూడా అలాంటి సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తేజ. అందుకే దాదాపు 15 సంవత్సరాల పాటు ఒక్క హిట్టు కూడా రాలేదు. 5 ఏళ్ల కింద రానాతో చేసిన నేనే రాజు నేనే మంత్రి సినిమా సూపర్ హిట్ కావడంతో తేజ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.. కొత్తగా ఆలోచిస్తున్నాడు అని అందరూ అనుకున్నారు. అలాంటిదేమీ లేదు అంటూ సీత సినిమాతో నిరూపించాడు. తాజాగా సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ దగ్గుబాటిని హీరోగా పరిచయం చేస్తూ తేజా చేస్తున్న సినిమా Ahimsa. ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత తేజ ఎంత వెనుకబడ్డాడో అర్థమవుతుంది అంటున్నారు విమర్శకులు. ఎందుకంటే 20 సంవత్సరాల కింద నువ్వు నేను, జయం సినిమాలో చూపించిన విజువల్స్ మళ్లీ ఇందులో కనిపిస్తున్నాయి.
ఒక నార్మల్ ప్రేమ కథను తీసుకొని మళ్ళీ తన స్టైల్ లో మిక్స్ చేసి అహింస సినిమాను తెరకెక్కిస్తున్నాడు తేజ. ఒకప్పటి జనరేషన్ ఈ సినిమాలు చూశారు కానీ ఈ జనరేషన్ ఆడియన్స్ కూడా తేజ సినిమాలు చూస్తారా అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. దీనికి సమాధానం తెలియాలంటే అక్టోబర్ 21 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే దివాళి బరిలో దిగుతుంది అహింస.