శర్వానంద్ హీరోగా ‘ఒకే ఒక జీవితం’ చిత్రాన్ని రూపొందించి విజయాన్ని అందుకున్నారు యువ దర్శకుడు శ్రీ కార్తీక్. ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంటున్నది. ఈ సందర్భంగా చిత్ర విజయంపై స్పందించారు దర్శకుడు శ్రీ కార్తీక్. ఆయన మాట్లాడుతూ..‘ఒక మంచి చిత్రంతో సక్సెస్ రావడం సంతోషంగా ఉంది. ఈ కథని రాయడానికి రెండేళ్ళు పట్టింది. కోవిడ్ వల్ల ఆలస్యమై ఐదేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చాం. అయితే నా నిరీక్షణకి తగిన ఫలితం దకింది. సినిమా అందరికీ చేరువయ్యింది. ఈ సినిమా మీద మేము పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు.
హీరో శర్వానంద్తో పని చేయడం మంచి అనుభవం. మా ఇద్దరికీ ఈ సినిమా ఒకే రకమైన భావోద్వేగాలను అందించింది. అమల నటనకు ఆడియెన్స్ ఉద్వేగానికి గురవుతున్నారు. నేను దర్శకుడిని కావడం మా అమ్మ చూడలేకపోయింది. అనారోగ్యంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. నేను గొప్ప స్థాయికి వెళ్లడం ఆమెకు తెలియాలి అనే ఆలోచన నేపథ్యంలో ఈ కథ పుట్టింది. కాలాన్ని వెనక్కి తీసుకెళ్తే అనే ఆలోచన అప్పుడు మొదలైంది. కథలో సైన్స్కు సంబంధించిన అంశాలు చేర్చడం వల్ల కొత్త తరహా సినిమా అయ్యింది. అమ్మ పాత్రకు అమలని తీసుకోవాలనే ఆలోచన నాదే. కథ విన్న తర్వాత ఆమెకు కూడా చాలా నచ్చింది. సినిమా చూసిన తర్వాత నాగార్జున గారు శర్వానంద్తో ఇకపై నిన్ను నా కొడుకులా చూస్తా అన్నారు. ఈ కాంప్లీమెంట్ నాకు దొరకలేదు కానీ అది నాకు దకిన ప్రశంస లాగానే భావిస్తా. అన్ని తరహాల సినిమాలు చేయాలని ఉంది. అల్లు అర్జున్ను అభిమానిస్తా. అవకాశం వస్తే ఆయనతో సినిమాకు దర్శకత్వం వహించాలని ఉంది. అని చెప్పారు.