Director Sreenu Vaitla | ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో విడాకులు ఎక్కువయ్యాయి. సమంత – నాగచైతన్య మొదలు ఆమీర్ఖాన్-కిరణ్రావు, ధనుష్-ఐశ్వర్య ఇలా ఈ ఏడాదిలో చాలామందే విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో మరో సెలబ్రెటీ జంట కూడా విడాకులు తీసుకోబోతున్నట్లు టాలీవుడ్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ శ్రీను వైట్ల విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తనదైన మార్క్ కామెడీకి కమర్షియల్ హంగులను జోడించి బ్లాక్బస్టర్ విజయాలను అందుకున్నాడు శ్రీనువైట్ల. అప్పట్లో ఈయన సినిమాలకు ఒక స్టార్ హీరో సినిమాకు ఉన్నంత ఫాలోయింగ్ ఉండేది. ఎంతో మంది స్టార్ హీరోలకు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాడు. కానీ దూకుడు తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. ఆ సినిమా తర్వాత ఆ స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడు. ఇక శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్గా నిలిచింది. దీంతో శ్రీనువైట్లకు అవకాశాలు రావడం తగ్గిపోయాయి. మధ్యలో ఢీ సీక్వెల్ అనౌన్స్ చేసినప్పటికీ అది పట్టాలెక్కలేదు. అప్పట్నుంచి శ్రీను వైట్ల మీడియా ముందు పెద్దగా కనిపించలేదు. ఇలాంటి సమయంలో శ్రీనువైట్ల విడాకుల వార్త తెరపైకి రావడంతో సోషల్మీడియాలో హాట్టాపిక్గా మారాడు.
శ్రీనువైట్ల తన సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసిన రూపను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు. శ్రీను వైట్ల విడాకులు తీసుకోబోతున్నట్లు గతంలో కూడా ప్రయత్నించారట. అయితే ఇంట్లో వాళ్లు నచ్చజెప్పడంతో అప్పట్లో విడాకుల నిర్ణయాన్ని విరమించుకున్నారట. కానీ మళ్లీ మనస్పర్థలు రావడంతో నాలుగేండ్లుగా ఇద్దరూ సపరేటుగానే ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో విడాకుల కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.