Tourist Family Movie | తమిళం నుంచి వచ్చి సూపర్ హిట్ అందుకున్న టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాపై ప్రశంసలు కురిపించాడు దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి. ఇటీవల చూసిన సినిమా బెస్ట్ ఇదే అంటూ కితాబు ఇచ్చాడు. తమిళ నటులు శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ(Tourist Family). నటులు యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేష్ జెగన్, ఎం.ఎస్. భాస్కర్, రమేష్ తిలక్, భగవతి పెరుమాళ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించగా.. అభిషన్ జీవింత్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం మే 01న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ను అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. తలైవర్ రజనీకాంత్తో పాటు నటుడు శివకార్తికేయన్ కూడా ఈ సినిమా చూసి చిత్రబృందంని ప్రత్యేకంగా పిలిపించుకుని అభినందించారు. తాజాగా ఈ సినిమాపై స్టార్ దర్శకుడు కూడా రాజమౌళి కూడా స్పందిస్తూ.. ఫిదా అయినట్లు తెలిపాడు.
నిన్న అద్భుతమైన, చాలా అద్భుతమైన టూరిస్ట్ ఫ్యామిలీ అనే సినిమా చూశాను. ఈ చిత్రం హృదయాన్ని హత్తుకునేలా ఉంది, కడుపుబ్బ నవ్వించే కామెడీతో పాటు ఎమోషన్తో.. ప్రారంభం నుంచి చివరి వరకు ఆసక్తికలిగించేలా ఉంది. అభిషన్ జీవింత్ ఈ సినిమాను గొప్పగా రాయడంతో పాటు దర్శకత్వం వహించాడు. ఇటీవల కాలంలో నేను చూసిన బెస్ట్ సినిమా ఇదే. మీరంతా కూడా కచ్చితంగా చూడండంటూ రాజమౌళి రాసుకోచ్చాడు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఒక తమిళ కుటుంబం తమ స్వస్థలాన్ని విడిచిపెట్టి భారతదేశానికి శరణార్థులు(refugee)గా వస్తారు. అనంతరం వారు చెన్నైలో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్లు ఎవరు అనేది చెప్పకుండా దాచిపెట్టాల్సి వస్తుంది. అలా దాచిపెడుతూ ఉండగా అనుకోకుండా రామేశ్వరం దగ్గర ఒక బాంబ్ బ్లాస్ట్ సంఘటన జరుగుతుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేయడం మొదలుపెడతారు. అయితే ఈ కేసుకి వీరికి సంబంధంమేంటి.. శ్రీలంక నుంచి వచ్చిన ఈ ఫ్యామిలీకి ఎదురైన సమస్యలేమిటి అనేది ఈ సినిమా కథ.
మరోవైపు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మరోవైపు తక్కువ బడ్జెట్తో రూపొందినప్పటికీ, 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచింది.